Friday, May 10, 2024

వానకొండయ్య శ్రీలక్ష్మీ నరసింహ స్వామికి తలంబ్రాలు సమర్పించిన మంత్రి ఎర్రబెల్లి


జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కడవెండి గ్రామం హనుమాన్ దేవాలయం నుంచి తలంబ్రాలను తలకు ఎత్తుకొని పొట్టిగుట్ట తండాలో కొండమీద ఉన్న శ్రీ వానకొండయ్య లక్ష్మీ నరసింహ స్వామి వారి కళ్యాణానికి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ… శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి తమ ఇలవేల్పు అన్నారు. వాన కొండయ్య శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి సన్నిధిలో ఇలా తలంబ్రాలు పట్టువస్త్రాలు సమర్పించే అవకాశం రావడం తన పూర్వ జన్మ సుకృతమన్నారు. ప్రజలు సుఖ శాంతులతో ఉండాలని, రాష్ట్రాన్ని బంగారు మయం చేస్తున్న సీఎం కెసీఆర్, వారి కుటుంబం చల్లగా నాలుగు కాలాల పాటు ఉండాలని ఆ స్వామి వారిని కోరుకున్నట్లు తెలిపారు. తన శక్తి మేరకు, వాన కొండయ్య శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంతో పాటు పాలకుర్తి నియోజకవర్గాన్ని రాష్ట్రంలో నెంబర్ వన్ గా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఆ స్వామి వారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, మంచిగా కాలం అయి, రాష్ట్రం, నియోజకవర్గం పాడి పంటలతో తులతూగాలని మంత్రి కోరుకున్నారు.
మిషన్ భగీరథ మంచినీటి ట్యాంకుకు ప్రారంభోత్సవం :
ఆ తర్వాత పొట్టిగుట్ట తండాలో మిషన్ భగీరథ మంచినీటి ట్యాంకును మంత్రి ప్రారంభించారు. స్వచ్ఛమైన, శుద్ధి చేసిన మంచినీరు ప్రజలకు అందుతాయని, ఈ నీటితో ఆరోగ్యాలు బాగుంటాయని మంత్రి చెప్పారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement