వరంగల్ క్రైమ్ (ప్రభ న్యూస్): వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ వివరణతో మెడికల్ పీజీ స్టూడెంట్ ధరావత్ ప్రీతి పేరెంట్స్ వెనక్కి తగ్గారు. పోలీసుల విచారణపై సంతృప్తిని వెలిబుచ్చారు. ఇవ్వాల (శనివారం) వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ ప్రీతి పేరెంట్స్ ను పిలిచి కేసు దర్యాప్తు వివరాలు వెల్లడించారు. సీపీ స్వయంగా తన కార్యాలయానికి పిలిపించుకొని పోస్ట్ మార్టం రిపోర్ట్, దర్యాప్తు విషయాలు, లభ్యమైన ఆధారాలు, సాక్ష్యాధారాలపై సుదీర్ఘంగా వివరించడంతో పాటు, ప్రీతి ఫ్యామిలీ లేవనెత్తిన అనుమానాలను నివృత్తి చేశారు.
అయితే.. కార్యాలయానికి వెళ్లే క్రమంలో ప్రీతి తల్లిదండ్రులు విలేకరులతో మాట్లాడారు. ఈ కేసు దర్యాప్తు సక్రమంగా సాగడం లేదని, సైఫ్ వేధింపుల వల్లే తమ కుమార్తె చనిపోయిందని, ఆత్మహత్య చేసుకునే అంత పిరికిది తన కూతురు కాదని వాదించిన వారే, సీపీని కలసి బయటకు వచ్చిన అనంతరం కేసు విచారణ తీరుపై సంతృప్తి చెందుతున్నట్లు ప్రకటించారు. ప్రీతి కేసు వివరాలను అందించారని, పూర్తి సమాచారాన్ని తెలుసుకున్నట్లు చెప్పారు.