Thursday, May 9, 2024

ఏజెన్సీ వాసులపై దాష్టీకం, సోలేం బాబును చితకబాదిన ఫారెస్ట్ ఆఫీసర్లు

గంగారం, ప్రభన్యూస్‌: కొన్ని రోజులుగా గంగారం ఏజెన్సీలో గిరిజనులు సాగుచేస్తున్న పోడు భూములలో అటవీ శాఖ అధికారులు కందకాలు తీయడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో గంగారం మండలం పుట్టలభూపతి గ్రామానికి చెందిన సోలేం బాబు శుక్రవారం ఆ సమయంలో తన పోడు భూమిలో అటవీశాఖ అధికారులు కందకాలు తీస్తుండగా తనకు కొంత భూమిని వదిలిపెట్టమని వేడుకున్నాడు. దీనికి ఆగ్రహించిన అటవీ అధికారులు తనపై విచక్షణారహితంగా చితకబాదారని, అనంతరం తమ వాహనంలో గంగారం అటవీ శాఖ కార్యాలయానికి తీసుకెళ్లారని దాహం వేస్తుంది అనగా బాటిల్‌లో మూత్రం పోసి ఇచ్చారని, మళ్లీ తనని అర్ధరాత్రి సమయంలో వదిలి వెళ్లారని బాధితుని కుటు-ంబ సభ్యులు తెలిపారు. బాధితునికి తీవ్ర గాయాలు కావడంతో గంగారం పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేసి బాధితుడ్ని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.

డిప్యూటీ రేంజ్‌ ఆఫీసర్‌ను సస్పెండ్‌ చేయాలి..

అడవిని నమ్ముకుని వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్న గిరిజనులపై విచక్షణ రహితంగా ప్రవర్తిస్తున్న డీఆర్వో కర్నా నాయక్‌ను వెంటనే సస్పెండ్‌ చేయాలని గంగారం ఎంపీపీ సువర్ణ పాక సరోజన, జడ్పీటీ-సీ ఈసం రమలు డిమాండ్‌ చేశారు. పుట్టలభూపతి గ్రామానికి చెందిన సోలేం బాబుపై చేయి చేసుకునే అధికారం అటవీ శాఖ అధికారులకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. సోలేం బాబుపై చేయి వేసిన ప్రతి ఒక్కరినీ సస్పెండ్‌ చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని కొత్తగూడ మండల కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ విషయంపై స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు సంఘాలు మండిపడ్డారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement