Sunday, April 28, 2024

TS : ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో….ఇద్దరు అదనపు ఎస్పీలకు 14రోజుల రిమాండ్‌

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ఇద్దరు అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలకు శనివారం అర్ధరాత్రి పోలీసులు అరెస్ట్‌ చేశారు. అనంతరం, ఈరోజు ఉదయమే వారిద్దరికి గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో హాజరుపరిచారు. ఈ క్రమంలో వీరికి కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. దీంతో, పంజాగుట్ట పోలీసులు వీరిని చంచల్‌గూడా జైలుకు తరలిస్తున్నారు.

ఇక, విచ్చలవిడిగా ఫోన్‌ట్యాపింగ్‌లకు పాల్పడిన వ్యవహారంలో ప్రణీత్‌తోపాటు వీరిద్దరి పాత్రను గుర్తించిన దర్యాప్తు అధికారులు వారిని అరెస్ట్‌ చేశారు. రాజకీయ ప్రముఖుల, వ్యాపారుల ఫోన్లను ట్యాప్‌ చేయడంలో వీరిద్దరి ప్రమేయం గురించి కీలకాధారాలను సేకరించే పనిలో దర్యాప్తు బృందం నిమగ్నమైంది. భుజంగరావు ఎన్నికల ముందు వరకు పొలిటికల్‌ ఇంటెలిజెన్స్‌ విభాగంలో, తిరుపతన్న ఎస్‌ఐబీలో అదనపు ఎస్పీగా విధులు నిర్వర్తించారు.

- Advertisement -

ఈ వ్యవహారంలో ఇప్పటికే ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావు, హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు, ఓ మీడియా సంస్థ నిర్వాహకుడు శ్రవణ్‌ రావుకు పాత్ర ఉన్నట్లు గుర్తించారు. ఈ ముగ్గురూ ఇప్పటికే దేశం దాటినట్లు వెల్లడి కావడంతో లుక్‌అవుట్‌ సర్క్యులర్‌ జారీ చేశారు. ప్రభాకర్‌ రావు అమెరికా, రాధాకిషన్‌ లండన్‌, శ్రవణ్‌రావు నైజిరియాలో ఉన్నట్టు సమాచారం. వీరితో పాటే విచారణకు రావాలని గతంలో ఎస్‌ఐబీలో పనిచేసిన తొమ్మిది మందికి నోటీసులిచ్చారు. ప్రణీత్‌రావు ఫోన్‌ట్యాపింగ్‌ సొంత నిర్ణయంతో జరిగింది కాదని.. గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన కొందరు నేతల కారణంగా ఫోన్‌ ట్యాపింగ్‌ జరిగినట్టు సిట్‌ బృందం భావిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement