Thursday, May 2, 2024

Tourist Spot – కేసీఆర్ పార్కులో త్వ‌ర‌లో టెంట్ సిటీ – మంత్రి శ్రీనివాస్ గౌడ్…

ఉమ్మడి మహబూబ్ న‌గర్ జిల్లా బ్యూరో ప్రభ న్యూస్ జూన్ 21: మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని కేసీఆర్ అర్బన్ ఎకో పార్క్ లో రాబోయే 4 నెలల్లో ప్రసిద్ధ వారణాసి టెంట్ సిటీ తరహాలో ఇక్కడ కూడా అత్యద్భుతంగా టెంట్ సిటీని ప్రారంభిస్తామని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, క్రీడలు, యువజన సర్వీసులు, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.

వారణాసిలో ఉన్న ప్రఖ్యాత టెంట్ సిటీ నిర్వాహకులు లల్లూజీ అండ్ సన్స్ గ్రూప్ ప్రతినిధులతో కలిసి బుధవారం నాడు ఎకో పార్కులో టెంట్ సిటీ ఏర్పాటు కోసం స్థల పరిశీలన చేశారు. మొదటి దశలో 20 లగ్జరీ టెంట్ హౌస్ లతో పాటు రెస్టారెంట్, అడ్వెంచర్ స్పోర్ట్స్ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వివరించారు. రెండో దశలో ఉడెన్ కాటేజెస్ కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. దేశంలోనే అతి పెద్దదైన ఎకో పార్కులో పర్యాటకులను ఈ టెంట్ సిటీ ఎంతగానో ఆకట్టుకుంటుందని ఆయన అన్నారు. సాధ్యమైనంత త్వరగా టెండర్లను ఆహ్వానిస్తున్నామని… ప్రఖ్యాత వారణాసి టెంట్ సిటీ నిర్వహిస్తున్న లల్లూజీ అండ్ సన్స్ గ్రూప్ సాధ్యమైనంత త్వరలోనే టెంట్ సిటీని అందుబాటులోకి తెస్తుందని తెలిపారు. రాష్ట్రంలో మహబూబ్ నగర్ అతి పెద్ద పర్యాటక ప్రాంతంగా మారనుందని ఈ సందర్భంగా మంత్రి వివరించారు.
పర్యాటకశాఖ ఓఎస్డి సత్యనారాయణ, లల్లూజీ అండ్ సన్స్ గ్రూపు బిజినెస్ హెడ్ సిద్ధార్థ మంత్రి వెంట ఎకో పార్కులో పర్యటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement