Monday, May 20, 2024

ప్రధాని పర్యటనకు మూడంచెల భద్రత.. తెలంగాణలో పెరుగుతున్న రాజకీయ వేడి

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : వచ్చే నెల 2, 3 తేదీలలో హెచ్‌ఐసీసీలో జరిగే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశానికి, 3 వ తేదీన సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో జరిగే బహిరంగ సభలో ప్రసంగించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్‌కు రానున్నారు. ఈ నేపథ్యంలో మోడీ పర్యటన క్రమంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్‌లో ప్రధాని రెండు రోజుల పర్యటన సందర్భంగా భద్రతలో భాగంగా కనీసం ఐదువేల మంది పోలీసులను మోహరించారు. సమావేశ వేదిక వెలుపల రాష్ట్ర పోలీసులు మూడంచెల భద్రతా విధానాలను అమలు చేయడం ద్వారా భద్రతను నిర్వహిస్తారు. అయితే ఎస్‌పీజీ కమాండోలు, కేంద్ర భద్రతా సిబ్బంది హెచ్‌ఐఐసీ, నోవాటెల్‌ మైదానాల్లో కాపలాగా ఉంటారు. ఎస్‌పీజీలు, ఇతర కేంద్ర బలగాలతో కమ్యూనికేట్‌ చేయడానికి, భద్రతా సంస్థలతో సమన్వయం చేయడానికి, పరిమిత సంఖ్యలో ఐపీఎస్‌ అధికారులను మాత్రమే సమావేశ మందిరం లోపల అనుమతించమని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ప్రధానమంత్రి కార్యాలయం, ఎస్‌పీజీ సీనియర్‌ అధికారులు తెలంగాణ పోలీసు సిబ్బందితో మాట్లాడి భద్రతా చర్యల గురించి మరింత తెలుసుకున్నారు. ప్రధానమంత్రి మినిట్‌ టూ మినిట్‌ ప్రోగ్రామ్‌ షెడ్యూల్‌ను రూపొందించడంపై పోలీసు ఉన్నతాధికారులు చర్చించారు, భద్రతా సన్నాహాల వివరాలను సమర్పించారు. వర్షాకాలం కావడంతో వాతావరణ నివేదికను పొందాలని భద్రతా అధికారులు వాతావరణశాఖ అధికారులను కూడా ఆదేశించారు. విమానాల రాకపోకలు సజావుగా సాగించేందుకు బేగంపేట విమానాశ్రయం నుంచి మాదాపూర్‌ హెచ్‌ఐసీసీ వరకు ట్రయల్‌ రన్‌ నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. హైదరాబాద్‌, రాచకొండ, సైబరాబాద్‌, పరిసర జిల్లాల్లోని వివిధ రాష్ట్రాలకు చెందిన పలువురు ముఖ్యమంత్రుల భద్రత కోసం అదనపు బందోబస్తును సిద్ధంగా ఉంచాలని పోలీసు అధికారులు సంబంధిత శాఖల నుంచి ఆదేశాలు జారీ చేశారు.

ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, బీజేపీ మాజీ అధ్యక్షులు, ఇతర పార్టీ నేతలు, ముఖ్యమంత్రులతో సహా దాదాపు 340 మంది బీజేపీ అగ్రనేతలు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి తరుణ్‌ చుగ్‌ వెల్లడించిన విషయం తెలిసిందే. ప్రధాన మంత్రిగా నరేంద్రమోడీ బాధ్యతలు చేపట్టిన ఎనిమిదేళ్ళలో నగరంలో రెండు రోజులు గడపడం ఇదే తొలిసారి కావడంతో పోలీసులు బందోబస్తుపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. రెండు రోజులపాటు జరిగే ఈ కార్యక్రమానికి ముందుగా జులై 1న పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శుల సమావేశం జరుగనుంది. ఆ రోజున బీజేపీకి సంబంధించిన ఫత్తానపతనాలకు సంబంధించిన భారీ ఛాయాచిత్ర ప్రదర్శనను నడ్డా ప్రారంభించనున్నారు. తర్వాత రెండు రోజుల్లో జరగనున్న జాతీయ కార్యవర్గ సమావేశానికి 183 మంది పార్టీ ఆఫీస్‌ బేరర్లు, రాష్ట్ర బీజేపీ నేతలు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, రవాణా మంత్రి నితిన్‌ గడ్కరీ, హోంమంత్రి అమిత్‌ షా సహా కేంద్ర కేబినెట్‌ సభ్యులు హాజరు కానున్నారు.

ఆహుతులందరికీ కేంద్ర పార్టీయే ప్రత్యేకంగా తయారు చేసిన పాస్‌లను జారీ చేయనుంది. సమావేశంలో పాల్గొంటున్న వారి పేరు, హోదా తదితరాలతో పాటు ఫొటోను కూడా ముద్రించిన పాస్‌లకు బార్‌కోడ్‌ను కూడా ఉంచనున్నారు. సమావేశ ప్రాంగణంలో కానీ, గదిలో కానీ అనుమానిత వ్యక్తుల కదలికలను గమనిస్తే భద్రతా సిబ్బంది పార్టీ జారీ చేసిన పాస్‌ను స్కాన్‌ చేసి వివరాలను క్షణాలలో తెలుసుకునేందుకు కావాల్సిన ఏర్పాట్లను కూడా చేస్తున్నారు. ప్రధాని భద్రతా సిబ్బందితో పాటు బ్లాక్‌ క్యాట్‌ కమెండోలు, సీఆర్‌పీఎఫ్‌, ఆర్‌ఎఎఫ్‌ తదితర సిబ్బంది, ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం కోసం రాష్ట్ర పోలీసు శాఖకు చెందిన ఉన్నతాధికారులకు బాధ్యతలను అప్పగించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement