Saturday, May 18, 2024

రోహిత్‌కు ఆ బాధ్యతలు తప్పించండి..

మూడు ఫార్మాట్లలోనూ ఫాంలో లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న రోహిత్‌ శర్మకు కెప్టెన్సీ బరువు తగ్గించే అవకాశాలు పరిశీలిస్తే మంచిదని టీమిండియా మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు. టీ20 ఫార్మాట్‌కు కెప్టెన్‌గా మరొకరి పేరు ఇండియన్‌ టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ఆలోచనల్లో ఉంటే… రోహిత్‌ శర్మకు ఉపశమనం కల్పిస్తే బాగుంటుందని పేర్కొన్నారు. తద్వారా రోహిత్‌ శర్మకు కెప్టెన్సీ పనిభారం తగ్గి మెరుగైన ప్రదర్శన చేసేందుకు అవకాశం లభిస్తుందని సెహ్వాగ్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు. రోహిత్‌కు తగినంత విశ్రాంతి లభించి, టెస్టులు, వన్డేల్లో సమర్థమైన కెప్టెన్‌గా రాణించే వీలుంటుందని పేర్కొన్నాడు. ప్రస్తుతం మూడు ఫార్మాట్లకు ఒకే కెప్టెన్‌ ఉండాలనే విధానానికి మేనేజ్‌మెంట్‌ కట్టుబడి ఉంటే… రోహిత్‌ శర్మ ఒక్కడే దానికి సరైన వ్యక్తిగా కనిపిస్తున్నాడని తాను అనుకుంటున్నట్లు సెహ్వాగ్‌ తెలిపారు.

ఈ మేరకు సెహ్వాగ్‌ సోనీ స్పోర్ట్స్‌ షోలో మాట్లాడుతూ… ”టీ20 ఫార్మాట్‌కు గనుక కొత్త కెప్టెన్‌ ఫలానా వ్యక్తి అని భారత క్రికెట్‌ జట్టు యాజమాన్యం మదిలోఎవరి పేరైనా ఉంటే… కచ్చితంగా రోహిత్‌ శర్మను రిలీవ్‌చేయాలి. తద్వారా ఒకటి రోహిత్‌పై పనిభారం తగ్గుతుంది. ముఖ్యంగా తన వయసు దృష్ట్యా ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. ఇక రెండో విషయం ఏమిటంటే… రోహిత్‌కు కావాల్సినంత విశ్రాంతి దొరుకుతుంది. తను పునరుత్తేజం పొందుతాడు. టెస్టులు, వన్డేల్లో మరింత దృష్టి సారించి జట్టును ముందుకు నడిపించగలుగుతాడు” అని చెప్పుకొచ్చాడు. ఐపీఎల్‌-2022లో రోహిత్‌ శర్మ సారథ్యంలోని ముంబై ఇండియన్స్‌ ఘోర పరాభవం మూటగట్టకున్న సంగతి తెలిసిందే. ఐదుసార్లు చాంపియన్‌ అయిన ఈ జట్టు తాజా సీజన్‌లో మాత్రం పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. ఈ పరిణామాల నేపథ్యంలో రోహిత్‌ టీ20 కెప్టెన్సీ గురించి సెహ్వాగ్‌ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement