Friday, May 17, 2024

ఒకేసారి పన్ను చెల్లిస్తే 5 శాతం రాయితీ.. జూలై 31 వ‌ర‌కు చాన్స్​

అమరావతి, ఆంధ్రప్రభ: పారిశ్రామికవేత్తల కోసం ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ (ఏపీఐఐసీ) మరో కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్‌ నేపథ్యంలో ఆస్తి పన్నులు, వాటి వడ్డీలు చెల్లించలేని పరిస్థితుల్లో ఎప్పటి నుంచో బకాయిలున్న వాణిజ్యవేత్తలకు మరో సదవకాశం కల్పించింది. ఒకేసారి మొత్తం చెల్లించే వారికి కట్టాల్సిన మొత్తం మీద 5 శాతం తగ్గించేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు జూన్‌ 16వ తేదీన జరిగిన 234వ సమావేశంలో ఆ ప్రతిపాదనకి ఏపీఐఐసీ బోర్డు ఆమోద ముద్ర వేసింది. 2022-23 ఏడాదికి గానూ చెల్లించవలసిన ఆస్తి పన్నును ఆయా పారిశ్రామికవేత్తలు జూలై 31వ తేదీ లోపే చెల్లించవలసి ఉంటు-ందని స్పష్టం చేసింది. రాబోయే రోజుల్లో ప్రతి ఏడాది ఏప్రిల్‌ 30వ తేదీలోపు ఒకే విడతలో మొత్తం ఆస్తి పన్ను చెల్లించిన పారిశ్రామికవేత్తలకు మొత్తం బకాయి చెల్లింపులో 5శాతం తగ్గింపు నిర్ణయాన్ని కొనసాగిస్తూ ఏపీఐఐసీ బోర్డు నిర్ణయం తీసుకున్నట్లు- పేర్కొంది.

ఈ విధానంలోనే ఆస్తి పన్నులను వసూలు చేసే విధంగా జోనల్‌ మేనేజర్లు, ఐలా కమిషనర్లకు ఏపీఐఐసీ వీసీ అండ్‌ ఎండీ సుబ్రమణ్యం జవ్వాది మార్గదర్శకాలిచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లోని పారిశ్రామిక వాడలతో పాటు- మున్సిపల్‌ ప్రాంతాల్లో ఉన్న పారిశ్రామికవాడలకు కూడా ఈ 5శాతం తగ్గింపు వర్తిస్తుంది. అయితే, అర్బన్‌ ఐలాల్లో జూన్‌ 30లోపు చెల్లించిన వారికే ఈ 5శాతం తగ్గింపు వర్తిస్తుందని పేర్కొన్నారు. 5 శాతం రాయితీ విధానంపై సీజీజీ ఆన్‌ లైన్‌ పోర్టల్‌ లో మార్గదర్శకాలు సోమవారం నుంచి అందుబాటులో ఉండనున్నాయి. పాత బకాయిలు, ప్రస్తుత ఆస్తి పన్ను, వడ్డీలపై ఏపీఐఐసీ తీసుకున్న నిర్ణయం ఎంతోమందికి ఊరటనిస్తుందని పారిశ్రామికవర్గాలు చెబుతున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement