Monday, May 6, 2024

TS: రాఖీ తెచ్చిన.. లే అన్నా… పుట్టెడు దు:ఖంతో.. రాఖీ కట్టిన చెల్లి

ఎలిగేడు, ఆగస్టు 30 (ప్రభ న్యూస్‌): అన్నా.. లేవే.. రాఖీ తెచ్చిన.. నాతో కట్టించుకోవా.. అన్నా.. అంటూ విగత జీవిగా పడి ఉన్న అన్నకు రాఖీ కట్టేందుకు ఓ చెల్లి గుండెలవిసేలా రోధించిన తీరు పలువురిని కలిచి వేసింది. అన్నాచెల్లెలి అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగ వేళ గుండెపోటు ఓ కుటుంబంలో తీవ్ర విషాదం మిగిలింది. వివరాల్లోకి వెళితే…

పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ధూళికట్టకు చెందిన ఆర్‌ఎంపీ కనకయ్య మంగళవారం అర్ధరాత్రి ఆకస్మాత్తుగా గుండెపోటుతో మృతిచెందాడు. అయితే అప్పటికే రాఖీ పండుగను పురస్కరించుకొని ఉదయం అన్నకు రాఖీ కట్టేందుకు కనకయ్య చెల్లెలు గౌరక్క ఏర్పాట్లు చేసుకుంది. పుట్టింటికి వచ్చేందుకు ఆతృతతో ఉన్న ఆమెకు అన్న గుండెపోటుతో మరణించిన విషయం తెలియడంతో బుధవారం ఉదయం హుటాహుటీన ధూళికట్టలోని కనకయ్య ఇంటికి చేరుకుంది. రాఖీ పండుగ కోసం అన్నయ్యకు కట్టేందుకు తెచ్చుకున్న రాఖీతోనే పుట్టెడు దు:ఖంతో వచ్చిన గౌరక్క విగత జీవిగా మిగిలిన తన అన్నను చూసి తట్టుకోలేక పోయింది. అన్నా.. నీ కోసం రాఖీ తెచ్చానే.. లే అన్నా.. అంటూ గుండెలవిసేలా రోధిస్తూ అన్న చేతికి రాఖీ కట్టిన తీరు స్థానికులను దు:ఖ సాగరంలో ముంచింది. ఎంతో ప్రేమగా తెచ్చిన రాఖీని చివరిసారిగా అన్నకు కట్టి కన్నీటి పర్యంతమైంది. దీంతో కుటుంబ సభ్యుల రోధనలు మిన్నంటాయి. అన్నాచెల్లెళ్లు ఎంతో సంతోషంగా జరుపుకోవాల్సిన రాఖీ పండుగ కనకయ్య కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement