Thursday, May 2, 2024

WGL: అభివృద్ధిలో తెలంగాణే దేశంలో నెంబ‌ర్ వ‌న్‌.. మంత్రి ఎర్రబెల్లి…

వ‌రంగ‌ల్‌, హ‌నుమ‌కొండ‌, జులై 29 : అభివృద్ధిలో దేశంలో తెలంగాణే నెంబర్ వన్ అని రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రా శాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అన్నారు. ఇటీవ‌ల ల‌డ‌క్ వెళ్ళి అక్క‌డ శిక్ష‌ణ ముగించి వ‌చ్చిన హ‌నుమ‌కొండ‌కు చెందిన‌ పేద‌రిక నిర్మూల‌న సంస్థ ఓరుగ‌ల్లు మ‌హా స‌మాఖ్య కు చెందిన 15 మంది మ‌హిళ‌ల‌తో మంత్రి హ‌నుమ‌కొండ‌లోని త‌న క్యాంపు కార్యాల‌యం ఆర్ అండ్ బి అతిథి గృహంలో ముఖా ముఖి అయ్యారు. వారితో గంట‌న్న‌ర‌పాటు చ‌ర్చించారు. సాధించిన ప్ర‌గ‌తిని చూశారు. వారి అనుభ‌వాల‌ను అడిగి తెలుసుకున్నారు. వారు శిక్ష‌ణ ఇస్తున్న తీరు తెన్నుల‌ను అడిగారు. వారికి ఎదుర‌వుతున్న స‌మ‌స్య‌ల‌ను తెలుసుకున్నారు. ఏండ్లుగా వారు నిర్వ‌హిస్తున్న శిక్ష‌ణ ప‌ద్ధ‌తులను కూడా తెలుసుకున్నారు. వారిని శ‌భాష్‌! మీ ప‌ని తీరు బాగుంది. మీరు దేశానికే ఆద‌ర్శంగా నిలుస్తున్నారంటూ అభినందించారు. మీ అనుభ‌వాల‌ను, నిర్వ‌హ‌ణా సామ‌ర్ధ్యాల‌ను క‌లిపి, దేశంలోని మిగ‌తా మ‌హిళా సంఘాల‌కు ఇస్తున్న శిక్ష‌ణ గొప్ప‌గా ఉంది. ఇంత గొప్ప కార్యాన్ని నిర్వ‌ర్తిస్తూ, దేశానికే ఆద‌ర్శంగా నిలిచిన మ‌హిళా మ‌ణులంద‌రికీ అభినంద‌న‌లు… అంటూ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అభినందించారు.

ఈ సంద‌ర్భంగా ప‌లువురు మ‌హిళ‌లు వారి వారి అనుభ‌వాల‌ను మంత్రికి వివ‌రించారు. మంత్రి అడిగిన ప్ర‌శ్న‌ల‌కు వారు స‌మాధానం చెప్పారు. వ‌రంగ‌ల్ ఉమ్మ‌డి జిల్లాకు చెందిన 10 ఉత్త‌మ ప్ర‌గ‌తి సాధించిన ఆద‌ర్శ సంఘాల‌తో క‌లిపి ఓరుగ‌ల్లు ప‌ర‌స్ప‌ర స‌హాయ‌క స‌హ‌కార మ‌హా స‌మాఖ్యగా ఏర్ప‌డింది. 18 ఏండ్లుగా ఈ సమాఖ్య ప‌ని చేస్తున్న‌ది. గ్రామీణ ప్రాంతాల్లో జీవనోపాదుల ఏర్పాటు ద్వారా పేద‌రిక నిర్మూల‌న, మ‌హిళ‌ల ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తున్నాయి. 2015లో ఈ స‌మాఖ్య తెలంగాణ‌లో ఏకైక జాతీయ స్థాయి మాన‌వ వ‌న‌రుల సంస్థ‌గా జాతీయ గుర్తింపును పొందింది. ఈ సంస్థ‌లోని దాదాపు 460 మంది రిసోర్స్ ప‌ర్స‌న్స్ త‌గు శిక్ష‌ణ పొంది, దేశంలోని వివిధ రాష్ట్రాల్లో త‌మ అనుభ‌వాల‌ను రంగ‌రించి శిక్ష‌ణ ఇస్తున్నారు.

- Advertisement -

అనంత‌రం మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు మాట్లాడుతూ… అప్ప‌ట్లో ఎన్టీ రామారావు డ్వాక్రా సంఘాల‌ను పెట్టారు. వాటిని సీఎం కేసీఆర్ బ‌లోపేతం చేశారన్నారు. అప్ప‌ట్లో అతి కొద్ది మొత్తం పొదుపు చేయ‌డంతో ప్రారంభ‌మై ఇవ్వాళ పేద‌రిక నిర్మూల‌న సంస్థ ఆధ్వ‌ర్యంలో 4,35,364 స్వ‌యం స‌హాయ‌క సంఘాల్లో 45,60,518 మంది మ‌హిళ‌లు స‌భ్యులుగా ఉన్నార‌న్నారు. దేశంలోనే ఇంత పెద్ద ఎత్తున సంఘటిత‌మైన మ‌హిళ‌లు తెలంగాణ‌లో త‌ప్ప ఎక్క‌డా లేర‌న్నారు. మ‌హిళ‌లు బాగుప‌డితే, ఆ కుటుంబం, స‌మాజం, గ్రామం, రాష్ట్రం, దేశం బాగుప‌డుతుంద‌ని తెలిపారు. అందుకే సీఎం కేసీఆర్ డ్వాక్రా సంఘాల‌ను బ‌లోపేతం చేస్తున్నార‌ని తెలిపారు. అనేక రుణాలు ఇప్పిస్తూ, మ‌హిళ‌ల‌ను పారిశ్రామికంగా ఎదిగేవిధంగా చేస్తున్నారన్నారు. అనేక ప‌థ‌కాల‌ను మ‌హిళ‌ల పేరునే, వారికే వ‌ర్తించే విధంగా చ‌ర్య‌లు తీసుకున్నారన్నారు. అందుకే ఇవ్వాళ మన మ‌హిళా సంఘాలు దేశానికే ఆద‌ర్శంగా నిలిచాయ‌ని మంత్రి వివ‌రించారు. మ‌హిళా సంఘాలు, అలాగే ఓరుగ‌ల్లు మ‌హిళా స‌మాఖ్య ఇదే ప‌ని తీరును కొన‌సాగిస్తూ, ప్ర‌పంచానికి ఆద‌ర్శంగా నిల‌వాల‌ని ఆకాంక్షించారు.

ఈ కార్య‌క్ర‌మంలో మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావుతో పాటు వ‌రంగ‌ల్ జెడ్పీ ఇన్ చార్జీ సిఇఓ, వ‌రంగ‌ల్ డీఆర్ డీఓ సంప‌త్ రావు, సెర్ప్ కు చెందిన త‌క్కెళ్ళ‌ప‌ల్లి ర‌వింద‌ర్ రావు, ఓరుగ‌ల్లు మ‌హా స‌మాఖ్యకు చెందిన మ‌హిళ‌లు, రిసోర్స్ ప‌ర్స‌న్స్‌, సీనియ‌ర్ క‌మ్యూనిటీ రిసోర్స్ ప‌ర్స‌న్స్‌, రాష్ట్ర స్థాయి క‌మ్యూనిటీ ట్రైన‌ర్స్‌, ప్రొఫెష‌న‌ల్ రిసోర్స్ ప‌ర్స‌న్స్‌, ఎల‌క్ట్రానిక్ మాస్ట‌ర్ ట్రైన‌ర్స్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement