Sunday, April 28, 2024

బెడ్‌ రిజర్వ్‌ చేసుకున్నాకే హైదరాబాద్ కు రండి: తెలంగాణ హెల్త్ డైరెక్టర్

ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారు తెలంగాణలో ఏ ఆస్పత్రిలోనైనా బెడ్ రిజర్వు చేసుకోవాలన్నాని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ స్పష్టం చేశారు. సరిహద్దుల్లో అంబులెన్స్‌లను అడ్డుకుంటున్నారన్నదానిపై ఆయన స్పందించారు. తాము ఎక్కడా అంబులెన్స్‌లను అడ్డుకోవడం లేదన్నారు. ముందస్తుగా ఆస్పత్రుల్లో బెడ్లు బుక్‌ చేసుకున్న తర్వాతే రాష్ట్రంలోకి రావాలన్నారు. ఎవరైతే తెలంగాణలో ఆస్పత్రిలో అడ్మిట్ అవ్వాలని అనుకుంటున్నారో వారు బెడ్ రిజర్వేషన్ లేకుండా నేరుగా వచ్చేసి ఆస్పత్రికి వెళ్లడం, అక్కడ బెడ్ లేకపోతే మరో ఆస్పత్రికి వెళ్లడం.. ఇలా మొత్తంగా బెడ్ కోసం ఐదారు ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో పేషెంట్లకు సరైన సమయంలో చికిత్స అందకపోవడంతో ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం గైడ్‌లైన్స్ రూపొందించిందని శ్రీనివాస్ తెలిపారు.

హైదరాబాద్‌లో స్టేట్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని శ్రీనివాస్ తెలిపారు. ఆస్పత్రి సిబ్బంది స్టేట్ కంట్రెల్ రూమ్‌కు ఫోన్ చేస్తారని, అక్కడి సిబ్బంది ఒక ఫార్మాట్‌లో వివరాలు రాసుకుని వాళ్లు హెల్త్ కార్యాలయానికి పంపుతారని వివరించారు. దాంతో ఆ పేషెంట్ తెలంగాణలోకి రావడానికి పర్మిషన్ లెటర్ ఇస్తామని శ్రీనివాస్ తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే పేషెంట్లకు అనుమతిపై ఈ కంట్రోల్ రూమ్ పర్యవేక్షిస్తుందని, 24 గంటలు పనిచేస్తుందని చెప్పారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే చాలా మంది రోగులకు తెలంగాణలో చికిత్స అందిస్తున్నామన్నారు. ఈ నిబంధనల ప్రకారం ట్రీట్‌మెంట్ చేస్తున్నామని, అంతేగానీ వేరే రాష్ట్రాల నుంచి వచ్చే పేషెంట్లకు చికిత్స చేయమని చెప్పలేదని శ్రీనివాస్ స్పష్టం చేశారు.

బాధితుల ఆరోగ్య పరిస్థితిని బట్టి వెంటనే అనుమతిస్తున్నామని అన్నారు. ఇతర రాష్ట్రాల బాధితులెవరైనా నిబంధనల మేరకు తెలంగాణలో వైద్యం చేయించుకోవచ్చని అన్నారు. ఇప్పటికే వేలాది మంది ఇతర రాష్ట్రాల రోగులకు వైద్యం అందించామని ఆయన తెలిపారు. 45 శాతం పడకల్లో ఇతర రాష్ట్రాల రోగులకు చికిత్స అందతున్నదని గుర్తుచేశారు. ఏ రాష్ట్ర ప్రజలను ఇబ్బంది పెట్టుకోవాలని తాము అనుకోవడం లేదన్నారు.  

Advertisement

తాజా వార్తలు

Advertisement