Friday, March 29, 2024

తెలంగాణ ప్రభుత్వ మార్గదర్శకాలపై హైకోర్టు స్టే

తెలంగాణ సరిహద్దుల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన అంబులెన్సులు నిలిపివేస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ప్రస్తుతం జారీ చేసిన ఆదేశాలు అమల్లో ఉంటాయని హైకోర్టు స్పష్టం చేసింది. ఏపీ-తెలంగాణ సరిహద్దుల్లో అంబులెన్సులను ఆపడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం.. గతంలో తాము జారీ చేసిన ఉత్తర్వులను పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తక్షణమే సర్క్యులర్‌లో మార్పులు చేసి కొత్త సర్క్యులర్ జారీ చేయాలని ఆదేశించింది.

ఇతర రాష్ట్రాల నుండి వచ్చే పేషంట్లు సహాయం కోసం కంట్రోల్ రూంను సంప్రదించవచ్చని, కానీ అంబులెన్సులో ఉండే పేషెంట్‌ను ఆపే అధికారం కంట్రోల్ రూంకు ఉండదని స్పష్టం చేసింది. విజయవాడ- హైదరాబాద్ నేషనల్ హైవే పూర్తిగా కేంద్రం చేతుల్లో ఉంటుందని, నేషనల్ హైవే యాక్టును ఉల్లంఘించడానికి తెలంగాణ ప్రభుత్వానికి ఎలాంటి అనుమతి లేదని కోర్టు తెలిపింది. కాగా తదుపరి విచారణను జూన్ 17కి వాయిదా వేసింది. కాగా ఈ అంశంపై దాఖలైన పిటిషన్ విచారణలో ఏపీ ప్రభుత్వం జోక్యం చేసుకుంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ శ్రీరాం వాదనలు వినిపించారు. ఏపీ ప్రభుత్వం అభ్యంతరాలపై తెలంగాణ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ సానుకూలత వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement