Thursday, May 2, 2024

భూ నిర్వాసితులకు తగిన పరిహారం ఇప్పించాలి.. మంత్రి గంగులకు బాధితుల వినతి

కరీంనగర్‌, వరంగల్‌ నేషనల్‌ హైవే 563 భూ సేకరణలో ఇండ్లు, ఇండ్ల స్థలాలు, వ్యవసాయ భూములు కోల్పోతున్న భూ నిర్వాసితులకు సరైన నష్టపరిహారం ఇప్పించాలని భూ నిర్వాసితులు మంత్రి గంగుల కమలాకర్‌ శుక్రవారం వినతిపత్రం ఇచ్చారు. చెంజర్ల , ఖాదర్ గూడెం భునిర్వాసితులు మంత్రిని తన నివాసంలో కలసి గోడు వెళ్లబోసుకున్నారు. దీనికి సానుకూలంగా స్పందించిన మంత్రి అప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ కర్ణన్ తో ఫోన్ లో మాట్లాడి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మానకొండూర్‌ మండలంలోని చెంజర్ల రెవెన్యూ పరిధిలో ఇండ్లు, ఇండ్ల స్థలాలు, వ్యవసాయ భూములు, బావులు, వ్యాపారాలు కోల్పోతున్న వారి భూములకు గుంట ఒక్కంటికి ధర రూ. 63 వేల చొప్పున నష్టపరిహారం చెల్లిస్తున్నారని, తహసీల్దార్‌ కార్యాలయానికి జాబితా ఇచ్చినట్టు తెలిపారు.

చెంజర్ల గ్రామం కరీంనగర్‌ జిల్లా కేంద్రానికి 14 కిలో మీటర్ల దూరం మాత్రమే ఉండి, శాతవాహన అర్బన్‌ డెవలప్‌ మెంట్‌ అధారిటి (సుడా) పరిధిలోని మెట్ట ప్రాంతమైనందున పారిశ్రామికంగా అభివృద్ధి చెందిందన్నారు. బహిరంగ మార్కెటులో కోల్పోతున్న భూముల ధరలు ఇండ్ల స్థలాలు గుంట ఒక్కంటికి ధర 8,00,000/– నుండి 10,00,000/– దాకా విలువ కలిగి ఉన్నాయన్నారు. వ్యవసాయ భూములు గుంట ఒక్కంటికి ధర రూ. 4,00,000 నుండి 6,00,000 దాకా విలువ ఉన్నందున ప్రభుత్వం ఇచ్చే పరిహారం బహిరంగ మార్కెట్‌ ప్రకారం ఇప్పించాలని కోరారు.

ఇండ్లు కోల్పోతున్న వారికి ఇంటి నిర్మాణానికి అయ్యే ఖర్చులు పెరిగినందున, సరియైన నష్టపరిహారం ఇప్పించాలని మంత్రిని కోరారు. భూ సేకరణ సర్వేలో భూమి, ఇండ్లు, బావులు, బోరులు చాల వరకు నమోదు చేయలేదని, కొంతమందికి నష్టపరిహార జాబితాలో చాల తక్కువగా నమోదు వచ్చిందన్నారు. దీనికి రీ సర్వే జరిపించి తగిన న్యాయం చేయాలని కోరారు. వినతిపత్రం అందజేసిన వారిలో చెంజర్ల ఎన్‌హెచ్‌–563 భూ నిర్వాసితులు బి.రత్నాకర్, జి.రామక్రిష్ణ తో పాటు సర్పంచ్ బొల్లా వేణుగోపాల్, ఎంపీటీసీ గడ్డి గణేష్ , లవయ్య , గౌస్ , వీర స్వామి , శ్రీనివాస్ రెడ్డి , సత్తయ్య , హరిశంకర్ , సంపత్ , రాధిక , సరోజన , తిరుపతి, బాపురెడ్డి శ్రీనివాస్ తదితరులున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement