Friday, May 17, 2024

రాజధానులపై అసెంబ్లీకి విస్పష్టమైన అధికారం ఉండాలి.. రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టిన విజయసాయిరెడ్డి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఒక రాష్ట్ర పరిధిలో రాజధానుల ఏర్పాటుపై ఆ రాష్ట్ర శాసనసభకు విస్పష్టమైన అధికారం ఉండేలా రాజ్యాంగ సవరణ కోరుతూ వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయిరెడ్డి శుక్రవారం రాజ్యసభలో ప్రైవేట్‌ మెంబర్‌ బిల్లును ప్రవేశపెట్టారు. రాష్ట్రంలోని ఏ ప్రాంతంలోనైనా ఒకటి అంతకంటే ఎక్కువ రాజధానుల ఏర్పాటు చేసే అధికారం వాస్తవానికి ఆయా రాష్ట్ర శాసన వ్యవస్థకే ఉందన్న ఆయన, దీనిపై మరింత స్పష్టత కోరుతూ ఈ ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వానికి చట్టబద్దంగా తిరుగులేని అధికారం కల్పించే ఉద్దేశంతో ఆర్టికల్‌ 3ఏని చేరుస్తూ రాజ్యాంగ సవరణ చేపట్టడం ఈ బిల్లు ఉద్దేశంగా పేర్కొన్నారు.

అలాగే ఏదైనా కేసులో విచారణ ఎదుర్కొంటూ కస్టడీలో ఉన్న లేదా అరెస్టైన పార్లమెంట్‌, అసెంబ్లీ సభ్యుడు రాష్ట్రపతి లేదా ఉపరాష్ట్రపతి ఎన్నికలో తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ప్రజా ప్రాతినిథ్య చట్టానికి సవరణ కోరుతూ విజయసాయి రెడ్డి మరో ప్రైవేట్‌ మెంబర్‌ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు. న్యూస్‌ ఛానళ్ళు, డిజిటల్‌ న్యూస్‌ ప్లాట్‌ఫారాల్లో వెల్లువెత్తుతున్న నకిలీ వార్తలను కట్టడి చేస్తూ వార్తా ప్రసారంలో ఆయా సంస్థలు పారదర్శకతను, నైతిక బాధ్యతను వహించేలా నియంత్రించే అధికారం ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాకు కట్టబెట్టే ఉద్దేశంతో చట్ట సవరణ కోరుతూ విజయసాయి రెడ్డి మూడో బిల్లును ప్రవేశపెట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement