Sunday, April 28, 2024

TS | బీసీ బంధు తరహాలో త్వరలో ‘మైనారిటీ బంధు’ : హరీష్‌రావు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : బీసీబంధు తరహాలోనే రాష్ట్రంలో పేద మైనారిటీలకూ రూ.లక్ష ఆర్థిక సాయం అందజేస్తామని, త్వరలోనే ప్రభుత్వం ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేస్తుందని మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. కుల, మతాలకు అతీతంగా ఏ వర్గంలో పేదరికం ఉన్నా.. దాన్ని పారద్రోలేందుకు కేసీఆర్‌ సర్కారు నిబద్ధతతో, చిత్తశుద్ధితో పని చేస్తోందని స్పష్టం చేశారు. మైనారిటీ బంధు పథకాన్ని ప్రారంభించి స్వయం ఉపాధి మార్గాలను పెంపొందించేందుకు ముఖ్యమంత్రి సానుకూల ధృక్పదంతో ఉన్నారని తెలిపారు. బ్యాంకులతో సంబంధం లేకుండా ఈ ఆర్థిక సాయం అందజేస్తామని పేర్కొన్నారు. మైనార్టీలకు ఆర్థిక సాయంపై ఇప్పటికే సీఎం కేసీఆర్‌ ఆదేశాలు ఇచ్చారని, అధికారుల స్థాయిలో అమలుకు సంబంధించిన విధివిధానాలు సిద్ధమవుతున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంపై రెండు, మూడు రోజుల్లో ఉత్తర్వులు జారీ చేస్తామని మంత్రి వెల్లడించారు.

పలు మైనార్టీ కార్పొరేషన్లకు చైర్మన్లుగా నియమితులైన వారిని మంత్రులు హరీష్‌రావు, మహముద్‌ అలీ సన్మానించారు. జలవిహార్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ఎంపీ రంజిత్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు షకీల్‌, దానం నాగేందర్‌, ఎమ్మెల్సీ ఫరూక్‌ హుస్సేన్‌, పలు మైనార్టీ కార్పొరేషన్ల చైర్మన్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ, మైనార్టీలను సీఎం కేసీఆర్‌ ఎంతో గౌరవిస్తారనీ, రెండు పర్యాయాలు మహమూద్‌ అలీని మంత్రిగా చేచడమే అందుకు నిదర్శనమని పేర్కొన్నారు. హిందూవులకు కల్యాణలక్ష్మి అమలు చేసినట్లు. మైనార్టీల కోసం షాదీ ముబారక్‌ అమలు చేస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. ఈ క్రమంలో మైనార్టీల కోసం రూ.లక్ష ఆర్థిక సాయం పథకాన్ని త్వరలోనే అమలు చేస్తామని, ఇందుకు సంబంధించిన జీవో ఒకటి, రెండు రోజుల్లోనే వస్తుందని పేర్కొన్నారు.

దేశంలో ఇప్పటికీ ముస్లింలు పేదవారిగానే ఉన్నారనీ, ఇదంతా కాంగ్రెస్‌ పార్టీ పాలన వల్లే జరిగిందని మంత్రి హరీష్‌రావు దుయ్యబట్టారు. ఈ ఏడాది బడ్జెట్‌లో మైనారిటీల సంక్షేమానికి రూ.2,200 కోట్ల నిధులతో ప్రాధాన్యత పెంచామన్నారు. కేసీఆర్‌ సర్కారు ఒకే ఒక్క సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన బడ్జెట్‌ కాంగ్రెస్‌ పార్టీ పది సంవత్సరాలలో కూడా పెట్టలేదని గుర్తు చేశారు. మైనార్టీ రెసిడెన్షియల్‌ స్కూళ్ళలో ఇంగ్లీష్‌ మీడియంతో పాటు- ఉర్దూ మీడియం కూడా అందుబాటు-లో ఉందని మంత్రి తెలిపారు. మైనార్టీ విద్యార్థులు డాక్టర్లు, ఇంజినీర్లుగా ఎదుగుతున్నారని పేర్కొన్నారు. ఉర్దూ మీడియంలో కూడా నీట్‌ నిర్వహించాలని అడిగిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఒక్కరే అని తెలిపారు. ముస్లింల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. ముస్లిం మైనార్టీల సంక్షేమం కోసం పనిచేస్తున్న పార్టీ బీఆర్‌ఎస్‌ పార్టీ, సీఎం కేసీఆర్‌ మాత్రమే అని హరీష్‌రావు స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement