Saturday, May 4, 2024

భారీ వర్షాలపై ప్రజలకు ఇబ్బందుల్లేకుండా సేవలు.. మంత్రి తలసాని

భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ నగరంలో ప్రజలు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా అన్ని శాఖల అధికారులు, సిబ్బంది సేవలు అందిస్తున్నారని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. గురువారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత రెడ్డిలతో కలిసి జీహెచ్ఎంసీ కార్యాలయంలోని కంట్రోల్ రూమ్ ను సందర్శించారు. కంట్రోల్ రూమ్ కు వస్తున్న ఫిర్యాదులు, పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలపై మంత్రి ఆరా తీశారు. మూడు షిఫ్టుల్లో వివిధ శాఖల సిబ్బంది విధులు నిర్వహిస్తున్నట్లు మంత్రికి వివరించారు. వాతావరణ శాఖ అందించే సమాచారం మేరకు జీహెచ్ఎంసీ పరిధిలోని అధికారులు, సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం మంత్రి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్, ఎస్ఎన్డీపీ ఈఎన్సీ జియా ఉద్దిన్ లతో కలిసి మీడియాతో మాట్లాడారు.

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుల దూరదృష్టి ఆలోచనలతోనే నగరంలోని అనేక ప్రాంతాల్లో వరద ముంపు సమస్య తొలగిపోయిందని పేర్కొన్నారు. నగరంలోని నాలాల సమగ్ర అభివృద్ధి కోసం చేపట్టిన ఎస్ఎన్డీపీ కార్యక్రమం క్రింద 36 నాలాల అభివృద్ధి పనులు చేపట్టగా, 30 పనులు పూర్తయ్యాయని, మిగిలిన 6 పనులు వేగంగా సాగుతున్నాయని వివరించారు. గత సంవత్సరం వరకు బేగంపేట నాలాకు ఎగువ నుండి వచ్చే వరదనీటి వలన నాలా వెంట ఉన్న బ్రాహ్మణ వాడి, శ్యాం లాల్ బిల్డింగ్ తదితర కాలనీలు వరదనీటితో మునిగిపోయి ప్రజలు అనేక అవస్తలు పడేవారని పేర్కొన్నారు. ఎస్ఎన్డీపీ కార్యక్రమం క్రింద బేగంపేట నాలా అభివృద్ధి పనులు చేపట్టిన ఫలితంగా ఈ సంవత్సరం అలాంటి పరిస్థితులు ఏర్పడలేదని చెప్పారు. ప్రారంభంలో ఎస్ఎన్డీపీ కార్యక్రమంపై పలు విమర్శలు వచ్చాయని, కానీ వాటి ఫలితాలు నేడు కండ్ల ముందు కనిపిస్తున్నాయన్నారు. అదేవిధంగా విజిలెన్స్ ఎన్ఫోర్స్ మెంట్ విభాగం దేశంలో ఎక్కడా లేదని, ఆ శాఖ ద్వారా కూడా ప్రజలకు వివిధ అత్యవసర సేవలు అందించబడుతున్నాయని అన్నారు. జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ కు వచ్చే పిర్యాదులపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ క్షేత్రస్థాయిలోని సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తూ సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు నిరంతరం సేవలు అందిస్తున్న అధికారులు, సిబ్బందిని మంత్రి ఈ సందర్బంగా అభినందించారు.

అదేవిధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కూడా ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావడం పట్ల కూడా మంత్రి వారిని అభినందించారు. ప్రజలు అత్యవసర సేవలకు జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ (040-21111111, 9000113667) కు కాల్ చేయాలని కోరారు. హుస్సేన్ సాగర్, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లలో ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో పై ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షిస్తూ లోతట్టు ప్రాంత ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్నట్లు వివరించారు. భారీ వర్షాల వలన ఎక్కడా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా, ప్రజలు ఇబ్బందులకు గురికాకుండా అవసరమైన చర్యలను చేపట్టేందుకు జీహెచ్ఎంసీ పరిధిలో 455 టీంలు పని చేస్తున్నాయని చెప్పారు. డీఆర్ఎఫ్, ట్రాఫిక్, మాన్ సూన్, ఎమర్జెన్సీ టీం లు కంట్రోల్ రూమ్ నుండి వచ్చే ఆదేశాలతో ఎప్పటికప్పుడు స్పందిస్తున్నాయన్నారు.

- Advertisement -

నీరు నిలిచిపోవడం, చెట్లు కూలిపోవడం, సీవరేజ్ పొంగిపోవడం వంటి ఫిర్యాదులు అధికంగా వస్తున్నాయని, వీలైనంత త్వరగా వాటిని పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. చెత్త తొలగింపు, పారిశుధ్య నిర్వహణ వంటి కార్యక్రమాలు కూడా ఎక్కడ ఆగకుండా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. రోడ్లు కూడా దెబ్బతిన్న ప్రాంతాలలో ఎప్పటికప్పుడు అవసరమైన మరమ్మతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా సర్కిల్ కు ఒకటి చొప్పున 30 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మరో 2, 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ ప్రకటించిందని, ప్రజలు అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని మంత్రి కోరారు. ముసరం బాగ్ వంతెన నిర్మాణ పనులను కూడా త్వరలోనే ప్రారంభించనున్నట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement