Thursday, May 9, 2024

సద్దుల బతుకమ్మ కోసం.. నెక్లెస్ రోడ్ లో ఏంచేశారంటే..

ప్రభ న్యూస్, హైదరాబాద్: ప్రకృతిని.. పూలను పూజించే బతుకమ్మ పండుగను మహిళలు ఘనంగా జరుపుకునే విధంగా ప్రభుత్వం అన్నిరకాల ఏర్పాట్లు చేసిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. నెక్లెస్ రోడ్ లోని కర్బలా మైదానం ఘాట్ వద్ద సద్దుల బతుకమ్మ కోసం చేస్తున్న ఏర్పాట్లను అధికారులతో కలిసి పరిశీలించారు. బుధవారం (13వ తేదీన) సద్దుల బతుకమ్మ సందర్భంగా అంబేద్కర్ నగర్, కర్బలా మైదానం, పీవీ ఘాట్లో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని బతుకమ్మ సంబురాలు నిర్వహిస్తారన్నారు. దానికి తగ్గట్టు ఆయా ప్రాంతాలలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా నెక్లెస్ రోడ్డుపై వాహనాల దారి మళ్లించాలని ట్రాఫిక్.. లా అండ్ ఆర్డర్ పోలీసులకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశాలిచ్చారు. విద్యుత్ లైట్ల ను ఏర్పాటు చేయాలని, బతుకమ్మ వేడుకల వద్దకు వచ్చే వారికి పంపిణీ చేసేందుకు వాటర్ ప్యాకెట్ లను అందుబాటులో ఉంచాలని వాటర్ వర్క్స్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో ప్రభుత్వం బతుకమ్మ పండుగను అధికారికంగా నిర్వహిస్తోందని మంత్రి గుర్తుచేశారు.

బతుకమ్మ కానుకగా ఏటా బతుకమ్మ చీరలను ఉచితంగా అందజేస్తున్నట్టు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ దేశ విదేశాలలో ఎంతో గొప్పగా నిర్వహిస్తుండటంతో విశ్వవ్యాప్తం అయ్యిందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement