Saturday, May 18, 2024

బాబుకు రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డికి కిరణ్ కుమార్ రెడ్డి శిష్యుడు.. హరీష్ రావు

గజ్వేల్, జులై 29(ప్రభ న్యూస్) : బాబుకు రేవంత్ రెడ్డి శిష్యుడు అయితే కిషన్ రెడ్డికి కిరణ్ కుమార్ రెడ్డి శిష్యుడని రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. సిద్ధిపేట జిల్లా గజ్వేల్ మండలం శ్రీగిరిపల్లి గ్రామ పంచాయతీ నూతన భవనాన్ని మంత్రి హరీశ్ రావు ప్రారంభించి అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. బీజేపీ రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చి వేలాది మంది రైతుల చావుకు కారణమైందన్నారు. మూడు గంటల కరెంటు చాలని తెలంగాణ ప్రజలకు శాపంగా కాంగ్రెస్ పార్టీ మారిందని ఆయా బీజేపీ, కాంగ్రెస్ పార్టీల తీరుపై రాష్ట్ర మంత్రి హరీశ్ రావు విరుచుకుపడ్డారు.

మూడు పంటలు పండాలనే కేసీఆర్ ను కడుపులో పెట్టి చూసుకుందామని, ఎవరు తెలంగాణ ప్రజా సంక్షేమంపై ముందు చూపుతో వ్యవహరిస్తున్నారో.. ప్రజలు మీరే ఆలోచన చేయాలన్నారు. మాజీ సీఎం చంద్రబాబు నాయుడు శిష్యుడు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి శిష్యుడు బీజేపీ కిషన్ రెడ్డిలు తెలంగాణ ప్రజలను మోసం చేసే పనిలో పడ్డారని, సద్దితిన్న రేవు తలవాలని సీఎం కేసీఆర్ ను నిండు మనస్సుతో దీవించాలని కోరారు. ఓవైపు తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమైక్యాంధ్ర మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి చెప్పినట్లు వింటున్నారని, మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి మాజీ సమైక్యాంధ్ర సీఎం చంద్రబాబు గురువని, ఆయన చెప్పినట్లు వింటున్నారంటూ.. వీరిద్దరితో మన తెలంగాణ బతుకులు ఆగమైతయని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ సీఎంలైన చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి ద్రోహులను అడ్డు పెట్టుకుని తెలంగాణ ఆత్మగౌరవాన్ని కుదువబెట్టే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి హరీశ్ రావు ధ్వజమెత్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement