Saturday, May 4, 2024

Revanth Reddy – నా వద్ద చెప్పేది ఒకటి.. చేసేది మరొకటి ఉండదు..

హైదరాబాద్‌: మెట్రో, ఫార్మా సిటీని రద్దు చేయట్లేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెల్లడించారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని స్ట్రీమ్ లైన్ చేస్తున్నామన్నారు. శంషాబాద్‌ విమానాశ్రయానికి వెళ్లే మెట్రో దూరం తగ్గిస్తామని స్పష్టం చేశారు. బీహెచ్‌ఈఎల్‌ నుంచి విమానాశ్రయానికి 32 కి.మీ దూరం ఉంటుందన్నారు. కొత్త సంవత్సరం సందర్భంగా నేడు సచివాలయంలో మీడియాతో చిట్ ఛాట్ చేస్తూ, ఎంజీబీఎస్‌ నుంచి పాతబస్తీ మీదుగా విమానాశ్రయానికి మెట్రో మార్గం ఏర్పాటు చేయనున్నట్లు సీఎం పేర్కొన్నారు. నాగోల్ నుంచి ఎల్బీ నగర్, చాంద్రాయణ గుట్ట వద్ద విమానాశ్రయానికి వెళ్లే మెట్రో లైన్‌కి లింక్ చేయనున్నట్లు చెప్పారు.

. ”అవసరమైతే మియాపూర్ నుంచి రామచంద్రాపురం, మైండ్ స్పేస్ వరకు ఉన్న మెట్రోని ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్ వరకు పొడిగిస్తాం. మేము కొత్తగా ప్రతిపాదించబోతున్న మెట్రో కారిడార్లు గత ప్రభుత్వం ప్రతిపాదించిన ఖర్చుతో పోలిస్తే తక్కువ ఖర్చుతోనే పూర్తవుతాయి” అని సీఎం వివరించారు.

”ఫార్మాసిటీ, రింగ్ రోడ్, రీజినల్‌ రింగ్ రోడ్ మధ్య జీరో కాలుష్యం తో ప్రత్యేక క్లస్టర్లను ఏర్పాటు చేస్తాం. ప్రత్యేక క్లస్టర్ల వద్ద పరిశ్రమల్లో పనిచేసే వారికి ఇళ్ల నిర్మాణం చేపడతాం. కార్మికులు హైదరాబాద్‌ వరకు రాకుండా అక్కడే అన్ని ఏర్పాట్లు చేస్తాం. యువతకు అవసరమైన నైపుణ్యాలు పెంచేందుకు ప్రత్యేక విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేస్తాం. అంతర్జాతీయ స్థాయిలో ప్రమాణాలు కలిగిన సంస్థలు, ప్రముఖ పారిశ్రామికవేత్తల ద్వారా శిక్షణ ఉంటుంది. ఈ నైపుణ్యాలకు సాధారణ డిగ్రీలకు ఉండే అర్హతలన్నీ ఉంటాయి” అని సీఎం వివరించారు.

100 పడకల ఆస్పత్రి ఉన్న చోట నర్సింగ్ కళాశాల..

”ఇప్పటికే అధికారాన్ని వికేంద్రీకరించాం. ఉమ్మడి జిల్లాలకు ఇంఛార్జిలుగా మంత్రులకు బాధ్యతలు అప్పగించాం. 100 పడకల ఆస్పత్రి ఉన్న చోట నర్సింగ్ కళాశాల ఉంటుంది. విదేశాలకు వెళ్లే యువతకు ఓరియంటేషన్ ఇప్పిస్తాం. ఆయా దేశాలకు అవసరమైన మ్యాన్‌పవర్‌ను ప్రభుత్వం ద్వారా అందిస్తాం. తద్వారా యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో యువత ఉంది. వారికి ఆసక్తి కలిగిన విభాగాల్లో శిక్షణ ఇప్పిస్తాం” అని సీఎం తెలిపారు.

- Advertisement -

నా వద్ద చెప్పేది ఒకటి.. చేసేది మరొకటి ఉండదు..

”మూడు కమిషనరేట్లకు కమిషనర్లను నియమించా. వారికి అవసరమైన సిబ్బందిని వారే ఎంపిక చేసుకుంటారు. శాఖలకు ప్రతిభ కలిగిన అధిపతులను నియమించడం వరకు నేను చూస్తాను. వాళ్ల పరిధిలో అవసరమైన అధికారులను నియమించుకొని యంత్రాంగం సక్రమంగా పనిచేసేలా వారే చూసుకోవాలి. అధికారుల నియామకాల్లో సామాజిక న్యాయం కూడా జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. సంస్కరణలు తీసుకొచ్చి స్ట్రీమ్ లైన్ చేసే పనిలో ఉన్నాం. నా వద్ద చెప్పేది ఒకటి.. చేసేది మరొకటి ఉండదు. ప్రెస్ అకాడమీ ఛైర్మన్‌ నియామకం తర్వాతే జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తాం. జర్నలిస్టులకు సంబంధించిన అన్ని సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరిస్తాం. ఇప్పటినుంచి వంద రోజుల్లో పరిష్కరిస్తాం.

3వ తేదీన పీసీసీ విస్తృతస్థాయి సమావేశం ఉంది..

జనవరి 3వ తేదీన పీసీసీ విస్తృతస్థాయి సమావేశం ఉంటుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు పదవులు కేటాయిస్తాం. పార్టీ కోసం పనిచేసిన వారితో నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తాం. నాకు దగ్గరగా ఉంటాడనో.. లేదా బంధువనో.. పదవులు ఇవ్వడం ఉండదు. ఏది చేసినా విస్తృత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని పదవులు భర్తీ చేస్తాం”అని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement