Sunday, April 28, 2024

Republic day Message – ప్ర‌జ‌లే పాల‌కులు – జ‌వాబుదారీత‌నంతో ప‌ని చేస్తాం..రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్ – తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో రిపబ్లిక్‌ డే వేడుకలు నిర్వహించారు. సీఎం రేవంత్‌రెడ్డి జాతీయ జెండాను ఎగరేశారు. 75వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ, దేశం మొత్తం గణతంత్ర దినోత్సవ శోభతో కళకళలాడుతోందని అన్నారు. రాజధాని ఢిల్లీతోపాటు ప్రధాన నగరాలన్నీ విద్యుత్‌ కాంతుల్లో వెలిగిపోతున్నాయ్ అని తెలిపారు. ప్రజాస్వామిక పాలన ద్వారానే రాజ్యాంగం ఆశించిన లక్ష్యాలు అన్ని వర్గాల ప్రజలకు అందుతాయని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అన్నారు. స్వేచ్ఛా స్వాతంత్ర్యం, సౌభ్రాతృత్వంతో పాటు అందరికీ న్యాయం అందాలనే మన భారత రాజ్యాంగ స్ఫూర్తి ఇప్పటికీ, ఎప్పటికీ ప్రపంచ దేశాలకు మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజున జరుపుకునే ఈ పండుగను ప్రజలందరూ సగర్వంగా జరుపుకోవాలని అన్నారు.

రాజ్యాంగ నిర్మాతలను, దేశాన్ని సమున్నతంగా నిలబెట్టిన మహనీయులను గుర్తు చేసుకోవాలని అన్నారు. ప్రజల పోరాటంతో పాటు రాజ్యాంగం ఇచ్చిన హక్కుల ద్వారానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని అన్నారు. తెలంగాణలో కొలువు దీరిన కొత్త ప్రభుత్వం రాజ్యాంగ ఆశయాలు, లక్ష్యాలను నెరవేర్చేందుకు కట్టుబడి ఉంటుందని అన్నారు. అధికారం చేపట్టిన మొదటి రోజు నుంచే తమ ప్రభుత్వం ప్రజా పాలనకు శ్రీకారం చుట్టిందని, ప్రజలే పాలకులనే జవాబుదారీతనంతో పని చేస్తుందని అన్నారు. నియంత పోకడలను పాతర పెట్టి, రాజ్యాంగబద్ధమైన విలువలు, విధానాలు, పద్ధతులను పునరుద్ధరించేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్పూర్తితో పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా తమ ప్రభుత్వం తెలంగాణ పునర్నిర్మాణానికి సిద్ధపడిందని అన్నారు.

అంత‌కు ముందు వీరుల సైనిక్ స్మారక్ వద్ద యుద్ధ వీరులకు నివాళుల‌ర్పించారు రేవంత్ రెడ్డి.

Advertisement

తాజా వార్తలు

Advertisement