పర్పుల్ డాట్ కామ్ 75 మిలియన్ డాలర్ల నిధులను సమీకరించినట్లు వెల్లడించింది. ఈ రౌండ్లో కేదారాను స్వాగతించడంతో పాటుగా సీక్వోయా క్యాపిటల్ ఇండియా, బ్లూమ్ వెంచర్స్ తమ పెట్టుబడులను రెట్టింపు చేశాయి. గతంలో 45 మిలియన్ డాలర్ల నిధులను వెర్లిన్వెస్ట్, బ్లూమ్ వెంచర్స్, జెఎస్డబ్ల్యు వెంచర్స్, తొలిసారిగా పెట్టుబడులను పెట్టిన సీక్వోయా క్యాపిటల్ ఇండియా నుంచి సేకరించిన ఆరు నెలల తరువాత ఈ నిధుల సేకరణ జరిగింది.
ఈసందర్భంగా పర్పుల్ డాట్ కామ్ కో ఫౌండర్ అండ్ సీఈఓ మనీష్ తనేజా మాట్లాడుతూ… తెలంగాణా తమకు వృద్ధి చెందుతున్న మార్కెట్ అన్నారు. అక్టోబర్ 2020తో పోలిస్తే అక్టోబర్ 2021లో తాము 90శాతం వృద్ధి చెందామన్నారు. బ్యూటీ ఉత్పత్తులు, వినియోగం కోసం మార్కెట్ గణనీయంగా వృద్ధి చెందడం చేత అదనపు వృద్ధికి ఇక్కడ అసాధారణ సామర్థ్యం ఉందని తాము నమ్ముతున్నామని అన్నారు. బ్యూటీ పరిశ్రమ విస్తరణ, వృద్ధి అనేవి ఇంకా ఆరంభ దశలోనే ఉన్నాయన్నారు. చారిత్రాత్మకంగా చూస్తే బ్యూటీ కోసం ఓ వ్యక్తి చేసే ఖర్చు తక్కువగానే ఉందని, దేశంలో బ్యూటీ కోసం సరాసరిన సంవత్సరానికి 10 డాలర్ల కన్నా తక్కువగా ఖర్చు చేస్తున్నారన్నారు. చర్మ సంరక్షణ, జుట్టు సంరక్షణ ఉత్పత్తుల వినియోగం పెరిగిందని మనీష్ తనేజా తెలిపారు.