Tuesday, April 30, 2024

Delhi: అసెంబ్లీ సీట్ల పెంపుపై కేంద్ర నిర్ణయంపై నిరసన.. హోంమంత్రికి బోయినపల్లి వినోద్ కుమార్ లేఖ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : తెలుగు రాష్ట్రాల్లో 2026 తర్వాతే అసెంబ్లీ సీట్ల పెంపు అన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. జమ్మూ, కాశ్మీర్ రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లను పెంచిన విధంగానే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కూడా అసెంబ్లీ సీట్లను పెంచాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు వినోద్ కుమార్ బుధవారం లేఖ రాశారు. రాజ్యసభలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ 2026 సంవత్సరం తర్వాత జరిగే జనాభా లెక్కల తర్వాత మాత్రమే తెలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ సీట్లను పెంచే విషయాన్ని పరిశీలిస్తామని స్పష్టం చేసిన విషయాన్ని వినోద్ కుమార్ గుర్తు చేశారు.

జనాభా లెక్కల సవరణ ప్రతి పదేళ్లకు ఒకసారి జరుగుతుందని, ఈ లెక్కన 2031 సంవత్సరం తర్వాత జరిగే జనాభా లెక్కల ప్రాతిపాదికన మాత్రమే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు అసెంబ్లీ సీట్లను పెంచే అవకాశం ఉందన్న విషయం స్పష్టమైందని, 2026 సంవత్సరం తర్వాత అనే పదంలోనే కేంద్రమంత్రి మాటల్లో తేలిపోయిందని ఆయన వివరించారు. కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాల పట్ల వివక్షత చూపుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకే దేశం-ఒకే చట్టమని నినాదాలు చేస్తున్న బీజేపీ వాస్తవంగా అందుకు భిన్నంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 170 ని సవరించకుండానే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల్లో ప్రధాని మోదీ ప్రభుత్వం అసెంబ్లీ సీట్లను పెంచిందని అదే పాలసీని తెలుగు రాష్ట్రాల్లో కూడా అమలు చేయాలని లేఖలో పేర్కొన్నారు. ఆర్టికల్ 170ని సవరించడం లేదా కేంద్ర ప్రభుత్వానికి ఉన్న ప్రత్యేక అధికారాల మేరకైనా అసెంబ్లీ సీట్లపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. తాను కరీంనగర్ ఎంపీగా ఉన్న సమయంలో ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రవేశపెట్టి తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల స్థానాలను పెంచాలని కోరిన విషయాన్ని వినోద్ కుమార్ గుర్తు చేశారు. ప్రస్తుత వర్షాకాల పార్లమెంటు సమావేశాల్లోనే ప్రత్యేక బిల్లును ప్రవేశపెట్టి సీట్ల పెంపుపై నిర్ణయం తీసుకోవాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement