Thursday, May 2, 2024

Telangana: బతుకమ్మ కానుకగా న్యూట్రీషన్ కిట్లు.. వచ్చే నెల నుంచి అందిస్తాం: మంత్రి హరీశ్‌రావు

వచ్చే నెల నుంచి బతుకమ్మ కానుగా సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు మహిళ సంక్షేమానికి న్యూట్రీషన్‌ కిట్లను పంపిణీ చేయనున్నట్లు మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీసెస్ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో శనివారం ప్రోగ్రామ్‌ మేనేజ్‌మెంట్‌ యూనిట్‌ను ప్రారంభించారు. ఎక్విప్మెంట్ మేనేజ్‌మెంట్‌ పాలసీ అమలు కోసం ఈ యూనిట్‌ను ప్రారంభించినట్లు తెలిపారు. ఇవాల్టి నుంచి పాలసీ అమలువుతోందన్నారు. దీంతో ప్రైవేట్‌లో మాదిరిగా ప్రభుత్వ ఆసుపత్రిలోని పరికరాలను వెంటనే గంటల్లో రిపేర్ చేయడం సాధ్యమవుతుందన్నారు.

ప్రభుత్వ దవాఖానలో కోట్ల విలువైన పరికరాలు ఉన్నాయని మంత్రి తెలిపారు. ఏఎంసీ పాలసీ అమలుకోసం రూ.17కోట్ల కేటాయించామన్నారు. 88885 26666 నంబరుతో కాల్ సెంటర్‌ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలో 5లక్షలకుపైగా విలువ ఉన్న పరికరాలు 1,020 ఉన్నాయని మంత్రి తెలిపారు. ఈఎంఎల్‌, ఏఎంఎల్‌ లిస్ట్‌ మందులు గతంలో 720 రకాలు ఉండగా.. ప్రస్తుతం 843కి పెంచినట్లు పేర్కొన్నారు. మందుల కొనుగోలుకు సీఎం కేసీఆర్ రూ.500 కోట్లు కేటాయించారని వివరించారు. ఇందులో రూ.100 కోట్లను సూపరింటెండెంట్ దగ్గర ఉంటాయనీ, మందుల నిర్వహణకు ఈ- ఔషధీ, పరికరాల నిర్వహణకు ఈ- ఉపకరణ్ అందుబాటులోకి తెచ్చినట్లు మంత్రి హరీశ్‌రావు తెలిపారు.

కిట్‌లో ఏం ఉంటాయంటే..
ఒక్కో కిట్‌ విలువ దాదాపు రూ.2వేలు ఉంటుందని, కిట్‌ రెండుసార్లు ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు. న్యూట్రీష‌న్ మిక్స్ పౌడ‌ర్ కిలో- 2 బాటిల్స్‌, ఒక కిలో ఖ‌ర్జూర‌, ఐర‌న్ సిర‌ప్ 3 బాటిల్స్‌, 500 గ్రాముల నెయ్యి ఉంటాయన్నారు. 13.30 లక్షల కేసీఆర్‌ కిట్స్‌ లబ్ధిదారులు ఉన్నారని, వారికి రూ.1200కోట్లు అందించినట్లు వివరించారు. శుక్రవారం టీఆర్‌ఆర్‌ మెడికల్‌ కాలేజీ విద్యార్థులను రీ అలోకేట్‌ చేయమని కేంద్రం నుంచి ఉత్తర్వులు వచ్చాయని, మెరిట్‌ ఆధారంగా మంగళవారంలోగా సర్దుబాటు చేస్తామన్నారు. మిగతా రెండు కాలేజీలకు సర్దుబాటు ఉత్తర్వులు రాగానే.. వారికి కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు వివరించారు.

బూస్టర్‌ డోస్‌ వేసుకోవాలి..
కొవిడ్‌ కేసులు మళ్లీ పెరుగుతున్నాయని, అర్హులందరికీ బూస్టర్‌ డోస్‌ వేసుకోవాలని హరీశ్‌రావు సూచించారు. టీకాల పంపిణీలో కేంద్రం విఫలమైందని ఆయన విమర్శించారు. బూస్టర్‌ స్టాక్‌ పెంచాలని లేఖ రాస్తే కాస్త స్పందించిందన్నారు. రాష్ట్రంలో సీ సెక్షన్‌ రేటు తగ్గిందని, 2021 ఆగస్టులో 62శాతం ఉంటే.. ఈ ఏడాది జూలైకి 56శాతానికి తగ్గిందని తెలిపారు. కేసీఆర్‌ కిట్‌, ప్రభుత్వం తీసుకుంటున్న అనేక చర్యల ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు గణనీయంగా పెరిగాయన్నారు. తెలంగాణ ఏర్పడ్డ నాడు 30శాతం ఉన్న ప్రసవాలు గణనీయంగా పెరిగి.. ప్రస్తుతం 66.8శాతానికి చేరాయన్నారు. ఈ ఘనత సాధించడంలో కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సీ-సెక్షన్‌ 47.24శాతం నుంచి 45.92శాతానికి తగ్గించామని, ప్రైవేటులో 80.98శాతం నుంచి 78.86శాతానికి తగ్గించినట్లు మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీలు పెంచేందుకు ఎంసీహెచ్‌ ఏర్పాటు చేశామని, సదుపాయాల కల్పనకు సీఎం కేసీఆర్‌ రూ.400కోట్లు వెచ్చించారన్నారు.

ఆ జిల్లాల్లో మొదట న్యూట్రీషన్‌ కిట్ల పంపిణీ
బిడ్డ క‌డుపులో పడ్డప్పటి నుంచి న్యూట్రీష‌న్ కిట్‌ ఇవ్వనున్నట్లు మంత్రి హరీశ్‌రావు తెలిపారు. డెలివ‌రీ అయిన త‌ర్వాత కేసీఆర్ కిట్‌ అందజేస్తామన్నారు. మ‌హిళ‌ల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వచ్చే నెల నుంచి బతుకమ్మ కానుకగా కేసీఆర్ న్యూట్రీష‌న్ కిట్ ఇవ్వబోతున్నామని, అత్యధికంగా ఎనీమియా ప్రభావం ఉన్న 9 జిల్లాలు.. ఆదిలాబాద్‌, భ‌ద్రాద్రి కొత్తగూడెం, జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి, జోగులాంబ గ‌ద్వాల్‌, కామారెడ్డి, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, ములుగు, నాగ‌ర్ క‌ర్నూల్‌, వికారాబాద్‌లలో ఈ కిట్ అందివ్వనున్నట్లు చెప్పారు. 1.50 లక్షల మంది గర్భిణులకు చేకూరనుందని తెలిపారు. ప్రోటీన్స్‌, మిన‌ర‌ల్స్‌, విట‌మిన్స్‌ను పోష‌కాహారం ద్వారా అందించి ర‌క్త హీన‌త త‌గ్గించ‌డం, హీమోగ్లోబిన్ శాతం పెంచ‌డం దీని లక్ష్యమని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement