Saturday, April 20, 2024

రాజీ మార్గమే సరైన మార్గం.. రాజీకుదిరిన‌ చోటే శాంతి సామ‌ర‌స్యం: హైకోర్టు జడ్జి మాధవి దేవి

జనగామ : రాజీమార్గమే సరైనదని, ఆవేశాలు అనర్ధాలకు మూలమని.. హైకోర్టు జడ్జి పి.మాధవిదేవి అన్నారు. శనివారం జ‌న‌గామ‌ జిల్లా కోర్టు ఆవరణలో స్వాతంత్ర్య వ‌జ్రోత్స‌వాలు సంద‌ర్భంగా నిర్వ‌హించిన ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. మండల న్యాయ సేవాధికార సంస్థ నిర్వ‌హించిన‌ జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమానికి హైకోర్టు జడ్జి ముఖ్య అతిథిగా హాజ‌రై మాట్లాడారు. కేసులు, పరిష్కారమనేది ఇతిహాసాల్లోనే ఉన్నాయన్నారు. పురాణాలలో సైతం స్పష్టంగా తెలియజేయబడిందని రాజీ కుదరకపోవడం చివరికి జరిగిన పరిణామాలు నేటికీ కళ్ల‌కు కట్టినట్లుగా కనిపిస్తున్నాయన్నారు. వీటిని పరిగణన లోకి తీసుకొని నేటి కక్షిదారులు రాజి కుదుర్చుకుంటేనే జీవితాలు బాగుంటాయని తెలిపారు.. రాజీ పడిన చోట శాంతి సామరస్యం ఏర్పడుతుందన్నారు. అప్పుడే భవిష్యత్తులో కుటుంబాలు సంతోషంగా ఉంటాయని పేర్కొన్నారు. ఇంటి సమస్యల కారణంగానే కేసులు దాకా వెళుతున్నారని తద్వారా సమయం డబ్బు వృధా అవుతున్న సంగతి మరచిపోతున్నారని ఈ సందర్బంగా గుర్తు చేశారు.

1982లో కేసుల పరిష్కారానికి రాజీ మార్గమే సరైనదని భావించి లోక్ అదాలత్ కార్యక్రమాన్ని రూపొందించి సమస్యలను పరిష్కరించడం జరుగుతున్నదని హైకోర్టు జడ్జి మాధవి దేవి పేర్కొన్నారు. కాలక్రమమైన 1987లో చట్టంగా రూపు దాల్చి 15 కోట్ల కేసులు లోక్ అదాలత్ లో పరిష్కారమయ్యాయని ఈ సందర్బంగా తెలిపారు. వేయి కేసులలో 2వందల కేసులు నేడు లోక్ అదాలత్ ద్వారా రావడం 20 శాతంగా ఉన్నందున అధికారులకు ఈ సందర్బంగా అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా జడ్జి శైలజ, జిల్లా కలెక్టర్ శివలింగయ్య, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి పృధ్విరాజ్, అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు నిమ్మ రామ్మోహన్ రెడ్డి, జనరల్ సెక్రటరీ ఈ.అశోక్, వైస్ ప్రెసిడెంట్ నరేష్ చంద్ర ఋషి, ఏ జి పి వి రామ్ గోపాల్, తీపి బిక్షపతి, స్పెషల్ పీపీ స్టీవెన్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement