Sunday, May 5, 2024

రూ.11 కోట్ల వ్యయంతో మోర్తాడ్ సర్వతోముఖాభివృద్ధి : మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

నిజామాబాద్ : బాల్కొండ నియోజకవర్గం మోర్తాడ్ మండల కేంద్రంలో సుమారు రూ.4.50 కోట్ల వ్యయంతో చేపట్టనున్న రోడ్డు వెడల్పు, డివైడర్, సెంట్రల్ లైటింగ్ పనులకు గురువారం రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. మూడు విడతల్లో మండల కేంద్రాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుకునే విధంగా ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. మొదట విడతగా రూ.4.50 కోట్లతో సెంట్రల్ లైటింగ్, రోడ్ విస్తరణ, డివైడర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

రెండో విడతలో మోర్తాడ్ తహిసిల్దార్ కార్యాలయం నుంచి పాలెం రోడ్డు వరకు నాలుగు లేన్ల రోడ్డు రూ.3.50 కోట్ల వ్యయంతో నిర్మిస్తామని, తర్వాత పోలీస్ స్టేషన్ ముందు ఉన్న బ్రిడ్జి రూ.3 కోట్ల వ్యయంతో విస్తరణ చేస్తామని చెప్పారు. ఇటీవల 57 కోట్లతో మంజూరైన పెద్దవాగు, కప్పల వాగు మీద మంజూరైన చెక్ డ్యాంల నిర్మాణం ఈ వానాకాలం వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత ప్రారంభించనున్నట్లు వెల్లడించాడు. ఇంత పెద్ద ఎత్తున మోర్తాడ్ గ్రామ అభివృద్ది జరుగుతున్నందున మోర్తాడ్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అంతకు ముందు మోర్తాడ్ చేరుకున్న మంత్రికి మోర్తాడ్ గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు. మహిళలు మంగళ హారతులతో స్వాగతించారు. దారి పొడవునా పూలు చల్లుతూ మోర్తాడ్ అభివృద్ధికి కృషి చేస్తున్న మంత్రికి దన్యవాదాలు తెలిపారు. గజమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement