Monday, April 29, 2024

ఆగస్టులో నీరా కేఫ్‌.. నెక్లెస్‌రోడ్డులో ఏర్పాటుకు వేగంగా చ‌ర్య‌లు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: నీరా, నీరా అనుబంధ ఉత్పత్తులైన బెల్లం, తేనే, చక్కెరతోపాటు ఇతర పదార్థాల అమలుపై అధ్యయనం చేసేందుకు ఒక కమిటీని నియమించనున్నారు. మంగళవారం రవీంద్ర భారతిలోని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ కార్యాలయంలో మంత్రి గంగుల కమలాకర్‌తో కలిసి నీరా ప్రాజెక్టుపై ఎక్సైజ్‌, టూరిజం, బీసీ సంక్షేమ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. నీరా ప్రాజెక్టుపై సీఎం ప్రత్యేక చొరవ చూపిస్తున్నారని, ఇందులో భాగంగానే దేశంలోని ఇతర రాష్ట్రాలలో గీత కార్మికులకు అందిస్తున్న సంక్షేమ పథకాలు, నీరా, అనుబంధ ఉత్పత్తులపై అధ్యయనం చేసేందుకు కమిటీని నియమించాలని నిర్ణయించారు.

అదేవిధంగా శాశ్వత అంగవైకల్యం పొందిన వారికి ఎక్స్‌గ్రేషియా అందజేసే విషయంలో ప్రస్తుతం ఉన్న నిబంధనలను సరళతరం చేయాలని, ప్రభుత్వ వైద్యుడు ఇచ్చే దృవీకరణ పత్రం ఆధారంగా బాధితుడికి వెంటనే పరిహారం చెల్లించాలని మంత్రి సూచించారు. నెక్లెస్‌ రోడ్డులోని నీరా కేఫ్‌ను జూలై నాటికి పూర్తి చేస్తామన్నారు. నీరా ఉత్పత్తులను ఆగస్టు నెలలో ప్రారంభించాలని అందుకు సంబంధించిన ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని అధికారులకు మంత్రులు ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement