Sunday, April 28, 2024

మ‌హిళ‌కు గుండెపోటు.. సీపీఆర్ చేసి ఊపిరి పోసిన‌ ఎస్సై

యాదాద్రి భువనగిరిలో ఓ ఎస్సై సమయస్ఫూర్తి మహిళ ప్రాణాలను కాపాడింది.. బస్ స్టాపులో కుప్పకూలిన మహిళకు ఎస్సై మహేందర్ లాల్ సకాలంలో సీపీఆర్ చేసి కాపాడారు. దీనికి సంబంధించిన వీడియో ఒక‌టి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎస్సై సమయస్ఫూర్తిని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. భువనగిరి బస్ స్టాప్ లో ఆదివారం ఈ ఘ‌ట‌న జ‌రిగింది. భువనగిరి మండలం మన్నెవారిపంపు గ్రామానికి చెందిన బోయిని వెంకటమ్మ, నర్సింహ దంపతులు ఆదివారం బస్ స్టాపులో బస్సు కోసం వేచి చూస్తున్నారు. ఉన్నట్టుండి వెంకటమ్మ కుప్పకూలింది. ఉలుకూ పలుకూ లేకుండా పడిపోయిన భార్యను చూసి ఏంచేయాలో తెలియక నర్సింహ కేకలు పెట్టాడు.

ఆ దారిలో వెళ్తున్న ఎస్సై స్పందించ‌డంతో..
త‌న భార్యను కాపాడాల‌ని నర్సింహ కేకలు పెట్టడంతో అటుగా వెళుతున్న వలిగొండ ఎస్సై డి.మహేందర్ లాల్ స్పందించారు. వెంటనే అక్కడికి చేరుకుని వెంకటమ్మ పరిస్థితిని గమనించారు. గుండెపోటుకు గురైందని భావించి సీపీఆర్ చేయడంతో కాసేపటికి వెంకటమ్మ కళ్లు తెరిచింది. తన వాహనంలో దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వెంకటమ్మకు ప్రాణాపాయం తప్పిందని, సకాలంలో సీపీఆర్ అందడంతో ఆమె బతికిందని డాక్ట‌ర్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement