Thursday, May 2, 2024

కేంద్రం వైఖరి ముమ్మాటికి మోసపురితమే .. మంత్రి జగదీష్ రెడ్డి

సూర్యాపేట : విద్యుత్ సంస్కరణలపై కేంద్రం వెనకడుగు అంటూ వస్తున్న కథనాలు ముమ్మాటికీ మోసపురితమైనవని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆరోపించారు. ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను గుర్తించిన మీదటనే బీజేపీ సర్కార్ ఇటువంటి లీకేజీలు ఇస్తుందంటూ ఆయన మండిపడ్డారు. వ్యవసాయ చట్టాల విషయంలోనూ గతంలో ఇదే జరిగిందని ఆయన ఆరోపించారు. కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకున్నట్లు కేంద్రం ప్రకటించినప్పటికీ, అనంతర కాలంలో మళ్ళీ అవే చట్టాలు తీసుకొస్తామంటూ బీజేపీ నేతలు చేస్తున్న ప్రకటనలను ఆయన గుర్తు చేశారు.

ఈ మేరకు సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఈరోజు తనను కలసిన మీడియా ప్రతినిధులు మోటర్లకు మీటర్ల పై కేంద్రం వెనకడుగు అంటూ మీడియాలో వస్తున్న కథనాలపై ప్రస్తావించగా… ఆయన తీవ్రంగా స్పందించారు. సంస్కరణల మార్పు విషయమై రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి సమాచారం లేదన్నారు. సంస్కరణలను ప్రతిపాదించిన రోజున కేంద్రం పంపిన దానికి ప్రభుత్వ వైఖరిని ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ ద్వారా స్పష్టంగా తెలియజేశారని మంత్రి జగదీష్ రెడ్డి గుర్తు చేశారు. తాజాగా వస్తున్న లీకేజీలపై కేంద్రం రాష్ట్రాన్ని సంప్రదించిన పక్షంలో ప్రజల గొంతుకకు అనుగుణంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం ఉంటుందన్నారు. విద్యుత్, వ్యవసాయ చట్టాలు దేశ ప్రజలకు గొడ్డలి పెట్టు లాంటివని ఆయన చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement