Saturday, April 27, 2024

TS : పాముకాటుతో పదో తరగతి విద్యార్థి మృతి….

మోత్కూర్, మార్చి 27 (ప్రభ న్యూస్) పాముకాటుతో పదో తరగతి విద్యార్థి మృతి చెందిన సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మండలం దత్తప్పగూడెం గ్రామంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ముక్కెర్ల కుమార్, మమత ల కుమారుడు పెద్ద కుమారుడు ఉమేష్ (15) రాత్రి ఇంట్లో నిద్రిస్తుండగా కట్ల పాము కాటు వేసింది.

తనను ఏదో కరిచిందని ఉమేష్ తల్లిదండ్రులకు చెప్పగా వారు లేచి చూడగా ఏమీ కనిపించలేదు. ఇల్లంతా వెతకగా గ్యాస్ సిలిండర్ కింద కట్ల పాము కనిపించగా దాన్ని కొట్టి చంపారు. ఇంతలోనే ఉమేష్ వాంతులు చేసుకోవడంతో భయాందోళనకు గురైన తల్లిదండ్రులు చుట్టుపక్కల వారిని లేపి ఉమేష్ ను చికిత్స కోసం ఆటోలో భువనగిరి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. తల్లిదండ్రులు, పిల్లలంతా కిందనే పడుకుంటున్నారు. ఇంట్లో నుంచి నీళ్లు బయటకు వెళ్లే రంధ్రం లోంచి పాము లోపలికి వచ్చి ఉంటుందని చెబుతున్నారు. మృతుడు ఉమేష్ దత్తప్పగూడెం హైస్కూల్లో పదవ తరగతి చదువుతూ ప్రస్తుతం పరీక్షలు రాస్తున్నాడు. మమత కుమార్ లకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు కాగా ఉమేష్ పెద్ద కొడుకు. కొడుకు మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement