Monday, April 29, 2024

మునుగోడు అభివృద్ధి టీఆర్ఎస్ తోనే సాధ్యం : మంత్రి ఎర్రబెల్లి

మునుగోడు నియోజకవర్గం ఉప ఎన్నికలో భాగంగా చండూరు 2వ, 3వ వార్డులలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇంటింటి ప్రచారం చేశారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. బీజేపీని ఈ ఉప ఎన్నికలో ఒడించాలి.. మునుగోడులో గతంలో టీఆర్ ఎస్‌ ఆదరించక పోయినా కేసీఆర్ ఇక్కడ అన్ని పథకాలను అందించి అభివృద్ధి చేశార‌న్నారు. అభివృద్ధి కొనసాగాలంటే, మునుగోడు టీఆరెఎస్ గెలవాల‌న్నారు. బీజేపీ కావాలని ఈ ఎన్నికలు తెచ్చిందని, వేల కోట్లకు అమ్ముడు పోయిన కొందరి స్వార్దంతో ఈ ఎన్నిక వచ్చింద‌న్నారు. అలాంటి వాళ్లకు, అవకాశ వాదులకు తగిన బుద్ధి చెప్పే అవకాశం ఇప్పుడు ప్రజలకు వచ్చింద‌న్నారు. ప్రజలు బాగా ఆలోచించి తమ ఓటు హక్కు ను వినియోగించుకోవాల‌ని సూచించారు.

సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి దేశంలోనే ఎవరూ చేయలేద‌న్నారు. రాష్ట్రాన్ని, మన గ్రామాలను దేశానికి ఆదర్శంగా నిలిపిన ఘనత సీఎం కేసీఆర్ దే అన్నారు. మన నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే, మన నాయకులు, మనకు ప్రతినిధులుగా ఉండాల‌న్నారు. పేదలకు రేషన్ కార్డులు, ఇండ్లు, పెన్షన్లు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలతో ఎంతో అభివృద్ధి చేశారు. మిషన్ భగిరథ‌తో మునుగోడులో ఫ్లోరైడ్ లేకుండా చేసిన ఘనత ఎవరిదో మీకు తెలుసు అన్నారు. ఇంతకాలం ఏలిన నాయకులకు ఈ సోయి వచ్చిందా?, అలాంటి పార్టీలు, నాయకులు మనకు అవసరమా?.. అందుకే అలాంటి పార్టీలను ఈ ఎన్నికలో బొంద పెట్టాల‌న్నారు. టీఆరెఎస్ పార్టీ కి పట్టం కట్టాలి, సారు, కారు తోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యం అని మంత్రి ఎర్ర‌బెల్లి అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement