Sunday, April 28, 2024

NZB: ఎన్టీఆర్ విగ్ర‌హానికి నివాళుల‌ర్పించిన మంత్రి తుమ్మ‌ల..

నిజామాబాద్ రూరల్ : రూరల్ పరిధిలోని ధర్మారం బి గ్రామంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప‌ర్య‌టించారు. ఈసంద‌ర్భంగా స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. ఆనంతరం మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు ఇంట్లో మంత్రికి శాలువాతో సన్మానించారు. ఈ కార్య‌క్ర‌మంలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, నగేష్ రెడ్డి బాగ రెడ్డి అమృతా పూర్ గంగా ధర్ తో పాటు కాంగ్రెస్ నాయకులు గ్రామస్థులు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, ఈ నెలాఖరులోగా రాష్ట్ర రైతుల ఖాతాల్లోకి రైతుబంధు నగదు జమవుతుందని స్పష్టంచేశారు. నందమూరి తారక రామారావు స్ఫూర్తితో రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతాంగ సంక్షేమానికి కృషి చేస్తుందన్నారు. . నిజామాబాద్ జిల్లా వ్యవసాయానికి పెట్టింది పేరంటూ పేర్కొన్నారు. ఎన్టీఆర్ నేటికీ తన ఆదర్శ నాయకుడంటూ మంత్రి పేర్కొన్నారు. రైతుల సంక్షేమం కోసం ఎన్టీఆర్ ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొచ్చారంటూ పేర్కొన్నారు. రెండు లక్షల రైతుల రుణమాఫీని దశలవారీగా రైతు ఖాతాల్లోకి జమ చేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోందని.. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.

ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే, రైతు డిక్లరేషన్ ను అమలు చేసి తీరుతామని తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఇప్పటికే రెండెకరాల లోపు వ్యవసాయ భూమి కలిగిన 29 లక్షల మంది రైతులకు రైతు బంధు అందించామని, మిగతా రైతులకు కూడా రేపటి నుంచి వారి ఖాతాల్లో రైతు బంధు డబ్బులు జమ అయ్యేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఈ నెలాఖరు లోపు రైతులందరి ఖాతాల్లో రైతు బంధు నిధులు పడతాయన్నారు.. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, రైతాంగ ప్రయోజనాలే పరమావధిగా పని చేస్తామని అన్నారు. రైతాంగ అవసరాలు, కష్టాలు తెలిసిన వ్యక్తిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రైతుల సంక్షేమానికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని తెలిపారు. ఆర్ధిక ఇబ్బందులు నెలకొని ఉన్నప్పటికీ రైతాంగ ప్రయోజనాల విషయంలో ఎంతమాత్రం రాజీ పడబోమని, ఎన్నికల సమయంలో రైతాంగ డిక్లరేషన్ లో పొందుపర్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని మంత్రి భరోసా కల్పించారు. రైతులకు రుణమాఫీని అమలు చేసే విషయంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతో పట్టుదలతో కృషి చేస్తున్నారని అన్నారు.

యాసంగి సీజన్‌లో రైతుబంధు వేయడానికి రూ.7,625 కోట్ల నిధులు అవసరం కాగా.. ఇప్పటివరకు ఎకరం లోపు పొలం ఉన్న 21 లక్షల మంది రైతులకు ప్రభుత్వం రూ.1,050 కోట్లు జమ చేసింది. మిగతా రైతులకు మనీ రావాల్సి ఉంది. మిగతా నిధుల కోసం కేంద్రాన్ని రూ.13,500 కోట్ల రుణం తీసుకునేందుకు అనుమతి కోరగా.. కేంద్రం రూ.9 వేల కోట్ల రుణం తీసుకోవడానికి అనుమతి ఇచ్చింది. వాటిలో 2 వేల కోట్లు ఈనెల వచ్చే అవకాశం ఉందని తెలిసింది. ఈ రుణం నుంచి కొంత రైతుబంధు పథకం కింద రైతులకు జమ చేసే అవకాశాలు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement