Sunday, April 28, 2024

సాయి ధరమ్ ఆరోగ్యంపై మంత్రి తలసాని ఆరా

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన హీరో సాయి ధరమ్‌ తేజ్‌.. వినాయకుడి ఆశీస్సులతో త్వరగా కోలుకుంటారని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతన్న సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యంపై మంత్రి ఆరా తీశారు. ప్రస్తుత పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపినట్లు చెప్పారు. దేవుని దయతో తొందరగా కోలుకోవాలని మంత్రి తలసాని ఆకాంక్షించారు.

మరోవైపు అపోలో ఆసుపత్రి వైద్యులు సాయిధరమ్ ఆరోగ్యంపై తాజా హెల్త్ బులెటిన్ ను విడుదల చేశారు. సాయిధరమ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని… ఆయన శరీర ప్రధాన అవయవాలు బాగానే పని చేస్తున్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతానికి ఆయనకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నామని, ఆయన ఆరోగ్యాన్ని వైద్య బృందం పర్యవేక్షిస్తోందని వెల్లడించారు. ఈరోజు మరిన్ని వైద్య పరీక్షలను నిర్వహిస్తామని, రేపు మరో హెల్త్ బులెటిన్ ను విడుదల చేస్తామని పేర్కొన్నారు.

సాయి ధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితి తెలుసుకునేందుకు అపోలో ఆసుపత్రికి సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. సాయితేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకుంటున్నారు. పలువురు సినీ ప్రముఖులు సాయితేజ్ త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. కాగా, మెగాస్టార్‌ చిరంజీవి మేనల్లుడైన సాయిధరమ్ తేజ్ శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లో బైక్‌పై వెళ్తుండగా అదుపుతప్పి కిందపడిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఆయన తీవ్ర గాయలయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement