Thursday, May 2, 2024

బీబీపేట్‌ జడ్పీ పాఠశాలను ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌


టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్ కామారెడ్డి జిల్లాలో పర్యటిస్తున్నారు. బీబీ పేట మండలంలోని జనగామ గ్రామంలో రూ.6 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ ఉన్నత పాఠశాల నూతన భవన సముదాయాన్ని మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, వేముల ప్రశాంత్‌ రెడ్డి, ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌తో కలిసి కేటీఆర్‌ ప్రారంభించారు. ప్రముఖ కాంట్రాక్టర్‌ సుభాష్‌ రెడ్డి సొంత ఖర్చుతో జనగామలోని ప్రభుత్వ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను ఆధునీకరించారు. కార్పొరేట్‌ పాఠశాలను తలపించే విధంగా తీర్చిదిద్దిన నూతన పాఠశాల భవంతిని మంత్రులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. కోనాపూర్‌ ప్రాథమిక పాఠశాలను ఆధునిక హంగుల‌తో నిర్మిస్తామన్నారు. అలాగే జూనియర్ కళాశాలకి అనుమతిని ఇస్తామని హామీనిచ్చారు. రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా బీబీపేట్‌లో కోట్ల రూపాయలతో ఇంత చక్కటి పాఠశాలని నిర్మించిన దాత సుభాష్‌ రెడ్డి కుటుంబ సభ్యులకి అభినందనలు తెలిపారు. పుట్టిన ఊరికి, చదువుకున్న పాఠశాలకి తన వంతు బాధ్యతగా ఏదో ఒకటి చేయాలనే ఆలోచన ప్రశంసనీయమన్నారు. దశాబ్దాలుగా పరిష్కారం కాని సమస్యలు తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పరిష్కరిస్తుందని మంత్రి తెలిపారు. 24 గంటల ఉచిత విద్యుత్‌తో పాటు, ఇంటింటికి తాగు నీరు అందిస్తున్నామని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement