Thursday, May 2, 2024

కేంద్రాన్ని గ‌ద్దె దించేదాకా పోరు ఆగ‌దు : హ‌రీశ్ రావు

కేంద్రాన్ని గ‌ద్దె దించేదాకా పోరు ఆగ‌ద‌ని రాష్ట్ర మంత్రి హ‌రీశ్ రావు అన్నారు. తెలంగాణ రైతులు పండించిన వడ్ల కొనుగోలు పై కేంద్రం అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ, కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం వద్ద 10 వేల మందితో నిరసన దీక్షలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. మంత్రితో పాటు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జిల్లా ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీ లు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు గారు మాట్లాడుతూ…. నాడు తెలంగాణ కోసం పోరాటం.. నేడు తెలంగాణ రైతుల కోసం పోరాటం అన్నారు. తమ పోరాటం రైతుల కోసం ధర్మ పోరాటం.. మనది గొంతెమ్మ కోరిక కాదన్నారు. నాడు కేంద్రంలోని అన్ని ప్రభుత్వాలు వడ్లు కొన్నాయి.. నాడు కొంటరేట్ల నేడు కొనరేందుకు అన్నారు. కేంద్రం లాభనష్టాలు బేరీజు వేసుకుని ప్రైవేట్ కంపెనీ లిమిటెడ్ లాగా పని చేస్తుంద‌న్నారు. మోడీ హయాంలో అచ్చె దిన్ కాదు సచ్చే దిన్ వచ్చిందన్నారు. ప్రజల నుంచి లాక్కోవడమే తప్ప ఇవ్వడం తెలియదన్నారు. రైతులను వడ్లు కొనకుండా కాల్చుకు తింటుందన్నారు. మన్ కి బాత్ కాదు ముందుగా త‌మ రైతుల బాధలు వినాల‌న్నారు. పండిన వడ్లు కొనే భాధ్యత మీ పైనే పెట్టింది రాజ్యాంగం అన్నారు.

వడ్లు కొనాలి.. నువ్వు బాయిల్డ్ రైస్ చేసుకుంటావా.. నూకలు చేసుకుంటావా, సన్న బియ్యం పెట్టుకుంటావా నీ ఇష్టం అన్నారు. కేంద్రం తొండాట అడుతున్నది.. రైతులను రోడ్ల మీదకు తెస్తున్నదన్నారు. విదేశాలకు వడ్లు ఎగుమతి చేయాలంటే అది కేంద్రమే చేయాలన్నారు. ఎస్టీలకు 11 శాతం రిజర్వేషన్లు కావాలని తీర్మానం చేసి పంపితే పంపలేదని అబద్దాలు చెబుతున్నార‌న్నారు. మోడీ అంటే మోదుడు.. బీజేపీ అంటే బాదుడు అన్నారు. పెట్రో ధరలు కరెంట్ మీటర్ ను మించి పెరుగుతుంద‌న్నారు. గత 14 రోజులుగా రోజూ చమురు ధరలు పెంచుతున్నార‌న్నారు. ఎరువుల ధరలు పెంచి రైతుల ఉసురు పోసుకుంటుంద‌న్నారు. కేంద్రంలో 16,50,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని.. వాటిని నింపకుండా నిరుద్యోగుల ఉసురు పోసుకుంటుంద‌న్నారు. గ్యాస్ మంటతో మళ్ళీ ఉనుక పొయ్యిలు వాపస్ వస్తున్నాయి.. మనం ముందుకు పోతున్నమా.. వెనక్కు పోతున్నమా..? అని ప్ర‌శ్నించారు. ఇది శాశ్వత మైన సమస్య.. గట్టిగా పోరాడి శాశ్వత పరిష్కారం సాధించుకోవాలన్నారు. రేపు కేంద్ర ప్రభుత్వ శవయాత్ర.. ప్రతి ఇంటిపై నల్ల జెండా ఎగురవేయాలన్నారు. రేపు జెండా ఎగుర వేస్తాం.. 11 న ఢిల్లీలో కేంద్రం కళ్లు తెరిపించేలా ఆందోళన చేస్తామ‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement