Saturday, May 4, 2024

Job Mela – ఒక్క రోజే 10వేల మందికి ఉద్యోగాలు..

మహబూబ్ నగర్,సెప్టెంబర్ 2 (ప్రభ న్యూస్): సాధించాలని పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అని రాష్ట్ర ఎక్సైజ్ ,క్రీడలు, సాంస్కృతిక ,పర్యటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు.శనివారం ఆయన  మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని శిల్పారామంలో 105 కంపెనీలతో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒకేరోజు మహబూబ్నగర్ నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకు పదివేల మందికి ఉద్యోగాలు కల్పించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. గత నెలలో జిల్లాలో 12 ఐటి కంపెనీలతో 650 మందికి ఉద్యోగాలు కల్పించామని, ఈ రోజు 10 వేల మందికి ఉద్యోగాలిస్తున్నామని, వచ్చే సంవత్సరం మరో 10 వేలు మందికి అమరరాజా కంపెనీ ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందని తెలిపారు. యువత వచ్చిన ఉద్యోగంలో చేరి అంచలంచలుగా ఎదిగి పెద్ద స్థాయిలో స్థిరపడాలని కోరారు . ప్రభుత్వ ,ప్రైవేటు ఉద్యోగం అని తేడాలు చూపకుండా చేరాలని అన్నారు.

ముఖ్యంగా జనాభాలో 2 శాతం మందికి మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయని అన్నారు. రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ ద్వారా ఇప్పటివరకు 18 జాబ్ మేళాలు నిర్వహించి 35000 మందికి ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లా నుండి గతంలో మట్టి పని కోసం వలస వెళ్లేవారని, ఒక్క ఇండస్ట్రీ ఉండేది కాదని, అలాంటిది ఇప్పుడు 400 ఎకరాలలో ఐ టి పార్క్ ఏర్పాటు చేశామని , హన్వాడ వద్ద ఫుడ్ పార్క్ ఏర్పాటు చేయటమే కాక, 2097 ఎకరాలలో అతిపెద్ద ఎకో పార్కును ఏర్పాటు చేశామని అన్నారు. దేశంలోనే అతిపెద్ద ఎకో పార్కుతో పాటు, దేశంలోనే అతిపెద్ద ఎనర్జీ పార్కు ఐటి పార్కులో ఏర్పాటు కానున్నదని వెల్లడించారు .మహబూబ్ నగర్ అన్ని రంగాలలో ముందుకు దూసుకెళుతున్నదని తెలిపారు. మహిళల కోసం ప్రత్యేకించి శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసి వారికి పరిశ్రమల ఏర్పాటులో అవకాశాలు కల్పించాలని, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను గుర్తించి చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ డైరెక్టర్ ను, జిల్లా కలెక్టర్లను కోరారు. యువత సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

రాష్ట్ర యువజన సర్వీసులు శాఖ డైరెక్టర్ వాసం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తమ శాఖ ద్వారా ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా జాబ్ నేలలు నిర్వహించి 35000 మంది కి ఉద్యోగాలు ఇచ్చామని, విద్యార్హతలను బట్టి ఉద్యోగలివ్వడమే కాకుండా మూగ, చెవిటి వంటి వారికి సైతం అవకాశాలు కల్పిస్తున్నామని, నిరుద్యోగ యువత ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
జిల్లా కలెక్టర్ జి.రవి నాయక్ మాట్లాడుతూ గత నెల జిల్లాలో ఐటీ కంపెనీల ద్వారా జాబ్ మేళా నిర్వహించామని, విద్యార్హత లేని వారికి సైతం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని , నిరూఫ్యోగా యువత వచ్చిన ఉద్యోగాలలో జాయిన్ కావాలని,దాని ఆధారంగా మరింత ముందుకెళ్లాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్ పి కె.నరసింహ, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు రాజేశ్వర్ గౌడ్, రెవెన్యూ అదనపు కలెక్టర్ ఎస్.మోహన రావు స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ యాదయ్య,మున్సిపల్ చైర్మన్ కె .సి నర్సింహులు,మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు గిరిధర్ రెడ్డి , ఇతర ప్రజా ప్రతినిధులు,అధికారులు హాజరయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement