Saturday, April 27, 2024

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ : మొక్కలు నాటిన ప్ర‌భుత్వ విప్ రేగా కాంతారావు, ఎంపీ మాలోత్ కవిత

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో కలిసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ఎంపీ మాలోత్ కవిత మొక్కలు నాటారు. సోమ‌వారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలోని ట్రైబల్ బీఈడీ, డీఈడీ కళాశాలలో విద్యార్థులతో కలిసి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొని పలు రకాల మొక్కలు నాటారు. ఈ సందర్భంగా రేగా కాంతారావు మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగస్వామ్యం కావడం ఎంతో సంతోషం, ఇది పర్యావరణ పరిరక్షణకు ఒక నిజమైన ఛాలెంజ్ అన్నారు. ఆక్సిజన్ కేంద్రాలు నెలకొల్పే పరిస్థితి మనకు వచ్చింది, అంటే మనం మొక్కలు నాటడం, పెంచడం బాధ్యతగా తీసుకోవాలి అన్నారు. మొక్కలు నాటిన వాటిని సంరక్షించడం వల్ల నేలతల్లికి అలాగే మన సమాజానికి ఎంతో ఉపయోగకరమని, మనమందరం ఆరోగ్యకరంగా ఉండాలంటే మొక్కలు నాటడం చాలా అవసరమని, మ‌నంద‌రం మొక్కలు పెంచే బాధ్యత తీసుకోవాలన్నారు.

సీఎం కేసీఆర్ మానస పుత్రిక హరితహారానికి మద్దతు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేపట్టి ప్రజలలో అవగాహన కల్పిస్తూ.. చెట్లు నాటే విధంగా ప్రోత్సహిస్తున్నార‌న్నారు. ఇంతటి అద్భుతమైన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను ప్రారంభించిన ఎంపీ, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జోగినిపల్లి సంతోష్ కుమార్ కి, ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, భద్రాచలం నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ ఇన్‌చార్జి డాక్టర్ తెల్లం వెంకట్రావు, టీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పార్టీ సీనియర్ నాయకులు, అధ్యాపకులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement