Saturday, May 4, 2024

TS: రాహుల్ గాంధీపై కవిత హాట్ కామెంట్స్.. స్క్రిప్ట్ చదివే నాయకుడంటూ విమర్శ

రాహుల్ గాంధీ స్క్రిప్ట్ చదివే నాయకుడంటూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాట్ కామెంట్స్ చేశారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గ కేంద్రంలో బతుకమ్మ సంబరాల సందర్భంగా ఎమ్మెల్సీ కవిత హాజరై విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ… రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు కుటుంబ పాలనపై మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. కేసీఆర్ ది కుటుంబ పాలన అయితే, రాహుల్ గాంధీ చేస్తున్న పాలన ఏంటని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు.


ఆర్మూర్ మండలం అంకాపూర్ లోని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నివాసంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గురువారం పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాహుల్ గాంధీపై హాట్ కామెంట్స్ చేశారు. రాహుల్ గాంధీకి రాష్ట్ర నాయకులు ఇచ్చిన స్క్రిప్ట్ తప్ప తనకేమీ తెలియదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏ రాష్ట్రంలోకి వెళ్తే ఆ రాష్ట్రంలో స్థానికంగా ఉన్న సమస్యలపై ఆయనకు అవగాహన లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే 24 గంటల విద్యుత్ ఉండదని వెల్లడించారు. ఇప్పటికే గెలిచిన కర్ణాటక రాష్ట్రంలో పథకాలు అమలు కావడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఒకరు 5 గంటలు మరొకరు 3 గంటల కరెంటు ఇస్తామని చెప్పడం వారిపై వారికే క్లారిటీ లేదని ఎద్దేవా చేశారు.

కాలేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ అంచనా వ్యయం లక్ష కోట్లు అయితే అవినీతి లక్ష కోట్లు జరిగిందని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోను అన్ని రాష్ట్రాల్లో కాపీ కొడుతూ మేమేదో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కాపీ కొట్టామని చెప్పడం విడ్డూరం అన్నారు. తెలంగాణ రాష్ట్ర పథకాలు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతు బంధు పథకాలను ఇతర రాష్ట్రాల్లో కాపీ కొట్టి తాము ఇస్తున్న పథకాలు అమలు చేస్తున్నారని ఆమె ఆరోపించారు.

- Advertisement -

ఈ సమావేశంలో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, రాష్ట్ర మార్క్ ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ సొసైటీ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ మధు శేఖర్, ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్ పండిత్ వినీత పవన్, వైస్ చైర్మన్ మున్ను, సర్పంచులు, స్థానిక కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement