Monday, April 29, 2024

రేణుకా జమదగ్నిల కళ్యాణ వేడుకలు..

ఎల్లారెడ్డిపేట: మండలంలోని బోప్పాపూర్‌ గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎల్లమ్మ సిద్ధోగంలో భాగంగా బుధవారం రేణుక జమదగ్నిల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. గ్రామ పురోహితులు రాచర్ల శ్రీనివాస్‌ శర్మ కళ్యాణాన్ని నిర్వహించగా, గౌడ సంఘం నాయకుడు 7 అంతస్థుల ఎల్లమ్మ బోనం తీసిన నాయకుడు చిదుగు రాధ గోవర్థన్‌ దంపతులు కళ్యాణం జరిపించారు. రేణుక ఎల్లమ్మ ఆలయం వద్ద ఎల్లమ్మ పట్నాలు, కళ్యాణ వేడుకలకు ఏర్పాట్లు చేసిన పూజారులు, గౌడ సంఘం నాయకులు కళ్యాణ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామంలో మొట్ట మొదటగా నిర్వహించిన వేడుకలలో కుమ్మరి, రజక, మంగలి, మాదిగ, ఎరుకల కులాల నుండి అమ్మ వారికి అవసరమైన బోనాలు, దిటిలు, ఎరుకల సొదమ్మ గంపలు తీసుకు రావడంతో ఆయా కులాలకు ప్రాధాన్యత కనబడింది. అలాగే పలు కులాల వారి వస్తువులు ఎల్లమ్మ గడ తో వెళ్లగా, పలు గ్రామాల గౌడ సంఘాల విరాళం, పలువురు నాయకుల ఆర్థిక సహాయం, పలు కుల సంఘాల విరాళాలు గ్రామ గౌడ సంఘం నాయకుల సహకారంతో అత్యంత ఘనంగా ఎల్లమ్మ సిద్దోగం కొనసాగింది. ఈ సందర్భంగా వేలాది మందికి అన్న దానం చేశారు. అమ్మ వారికి అధిక సంఖ్యలో పాల్గొన్న మహిళలు వొడి బియ్యం, నూతన వస్త్రాలు సమర్పించి మొక్కులు చెల్లించారు. ఈ వేడుకల్లో టిఆర్‌ఎస్‌ జిల్లా ఇంఛార్జి తోట ఆగయ్య, జెడ్పీటీసీ చీటీ లక్ష్మణ్‌ రావు, ఎంపిపి పిల్లి రేణుక కిషన్‌, ఏఎంసీ చైర్మెన్‌ కొండ రమేష్‌ గౌడ్‌, పిఎసీఎస్‌ చైర్మెన్‌ కృష్ణ రెడ్డి, సర్పంచ్‌ బాల్‌రెడ్డి, ఎంపిటిసి గీతాంజలి, టీ-ఆరెఎస్‌ నాయకులు నంది కిషన్‌, వార్సా కృష్ణహరితోపాటు- జిల్లాలోని పలు మండలాల సర్పంచులు ఎంపిటిసిలు కార్యకర్తలు, గౌడ సంఘం నేతలు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement