Thursday, May 2, 2024

Peddapalli: మాయ మాటలు నమ్మితే మోసపోతారు.. ఎమ్మెల్యే దాసరి

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందాలని ప్రతిపక్ష నాయకులు మాయమాటలు చెబుతారని, వాటిని నమ్మితే మోసపోతారని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. ఇంటింటా ప్రచారంలో భాగంగా నియోజకవర్గంలోని కాల్వ శ్రీరాంపూర్ మండలం వెన్నంపల్లి గ్రామంలో గడప గడపకు వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను, గత తొమ్మిదేళ్లలో జరిగిన అభివృద్ధిని వివరించారు. ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న సమయంలో నియోజకవర్గ అభివృద్ధిని మర్చిపోయారన్నారు. 40 ఏళ్లలో జరగని అభివృద్దిని 9 ఏళ్లలో చేసి చూపామన్నారు. ఓట్ల కోసం ప్రతిపక్ష నాయకులు వస్తే అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారని నిలదీయాలన్నారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరాయన్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో ప్రపంచంలోనే ఎక్కడా లేని పథకాలను అమలు చేస్తున్నారన్నారు. మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ విజయం సాధించడం పక్కా అని, పెద్దపల్లిలో గులాబీ జెండా ఎగిరే విధంగా ఆశీర్వదించాలన్నారు. ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు విడుదల చేసిందని, నియోజకవర్గంలో రోడ్లు, డ్రైనేజీలు, కల్వర్టులతో పాటు ఇతర పనులన్నీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశామన్నారు. సీఎం కేసీఆర్
దూరదృష్టితో పెద్దపల్లిని జిల్లాగా మార్చారన్నారు. రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేసేందుకు అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి మరోసారి గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి వంగల తిరుపతిరెడ్డి, ఎంపీపీ నూనెటిసంపత్ తో పాటు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement