Monday, April 29, 2024

నిరుపేదల పాలిట వరం సీఎంఆర్ఎఫ్ : ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి

181 మందికి రూ.61.29 లక్షల చెక్కులు
నిరుపేదల పాలిట ముఖ్యమంత్రి సహాయనిధి వరంగా మారిందని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని ఆరు మండలాలకు చెందిన 181 మంది లబ్ధిదారులకు 61,29,500 రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ నిరుపేదల ఆరోగ్య రక్షణకు తమ ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. నిరుపేదలు అనారోగ్యాల బారిన పడి ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొంది సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తు చేసుకుంటే సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక చేయూతనందిస్తున్నామన్నారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో తెరాస ప్రభుత్వం ప్రభుత్వాసుపత్రులను బలోపేతం చేయడంతో పాటు కార్పొరేట్ వైద్యం ప్రభుత్వ ఆసుపత్రిలో అందేలా చర్యలు తీసుకుందన్నారు. మాతా శిశు కేంద్రాల ద్వారా గర్భిణీ స్త్రీలకు ఉచితంగా డెలివరీలు చేయడంతో పాటు కేసీఆర్ కిట్లను అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు, తెరాస నాయకులతో పాటు లబ్ధిదారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement