Tuesday, May 14, 2024

డ్రైనేజీలో దిగి నిరసన తెలిపిన టీఆర్ఎస్ కార్పొరేటర్ భర్త!

హైద‌రాబాద్ న‌గ‌రాన్ని వ‌ర్షాలు ముంచెత్తుతోంది. ఈదురుగాలుల‌తో కూడిన వాన ప‌డింది. వర్షంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. అయినా జీహెచ్ఎంసీ అధికారుల పనితీరుపై అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు అవరసమైన చర్యలు చేపట్టడంలో అధికారులు, కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ సోమాజీగూడ టీఆర్ఎస్ కార్పొరేటర్ సంగీతా యాదవ్ భర్త శ్రీనివాస్ యాదవ్ నిరసనకు దిగారు. బీఎస్ ముక్తా నుంచి హుస్సేస్ సాగర్ వైపు వెళ్లే నాలా వెడల్సు పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ నడుం లోతు మురుగు నీళ్లలోకి దిగి నిరసన వ్యక్తం చేశారు.

గతేడాది వరదల సమయంలోనూ మంత్రి కేటీఆర్ ఈ ప్రాంతంలో పర్యటించి సమస్యను గుర్తించి రూ.2 కోట్లు నిధులను కూడా మంజూరు చేశారని ఆయన తెలిపారు. మళ్లీ వర్షాకాలం మొదలవుతుండటంతో డ్రైనేజీలు, నాలాలు వెడెల్పు పనులు చేయడం లేదని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. అనేక సార్లు అధికారులు, కాంట్రాక్టర్ల దృష్టికి సమస్యను తీసుకెళ్లినా పట్టించుకోకపోవడంతో ఈ విధంగా నిరసన చేయాల్సిన వచ్చిందని తెలిపారు. శుక్రవారం పనులు ప్రారంభించి త్వరగా పూర్తి చేస్తామని జీహెచ్ఎంసీ మేయర్ విజయ లక్ష్మీ, సంబంధిత అధికారులు హామీ ఇవ్వడంతో శ్రీనివాస్ యాదవ్ నిరసన విరమించారు.  

Advertisement

తాజా వార్తలు

Advertisement