Wednesday, May 1, 2024

HYD: యోగా, ధ్యానాలతో ఒత్తిడిని దూరం చేయవచ్చు… గురుదేవ్ రవి శంకర్

హైదరాబాద్ : సమాజంలో మానవతా విలువలని పెంచటానికి కలిసి నడుద్దాం.. కలిసి ఎదుగుదాం.. ముందుకు సాగుదాం అనే నినాదంతో పాటు మత్తు మందుల వినియోగానికి వ్యతిరేకంగా యువత ప్రతిజ్ఞ చేయాలని పిలుపునిస్తూ గీతం డీమ్డ్ విశ్వ విద్యాలయం వేదికగా ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక సంస్థ ఆర్ట్ అఫ్ లివింగ్ ఇటీవల నిర్వహించిన ఎడ్యుమీట్ కు భారీ సంఖ్యలో యువత హాజరైంది. నగరంలోని వివిధ కళాశాలలు, పక్క గ్రామాల నుంచి యువత పెద్ద సంఖ్య లో హాజరయ్యారు. ఆర్ట్ అఫ్ లివింగ్ వ్యవస్థాపకులు రవి శంకర్ యువతను ఉద్దేశించి చేసిన ప్రసంగం యువతను ఆకట్టుకుంది.

నేటి యువత ఒత్తిడి అధికంగా ఎదుర్కొంటున్నదని, ఈ కారణం చేత మత్తుకు బానిస అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. యోగా, ధ్యాన మార్గాల ద్వారా అంతర్గత శక్తులని మేలుకొల్పడంతో పాటు ఒత్తిడిలను దూరం చేసుకోవచ్చని ఆయన సూచించారు. యువత తమలో దాగిన శాస్త్ర‌వేత్తను బయటకు తీయాలని పిలుపునిచ్చిన ఆయన ప్రజల మధ్య ఆత్మీయ భావం పెరగాలని.. అందరూ మనవాళ్లే అనే భావనతో సమాజంలో మంచిని పెంచాలన్నారు. అనంతరం డ్రగ్స్ వినియోగంపై వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు.

గీతం అధ్యక్షుడు ఎం భరత్ మాట్లాడుతూ… దాదాపు రెండువేల మంది విద్యార్థులు ఆర్ట్ అఫ్ లివింగ్ లో ప్రయోజనం పొందారు.. చదువులో సైతం వారు రాణిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గీతం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ దయానంద సిద్దవటం, నారాయణ విద్యా సంస్థల చైర్మన్ సింధూర, గీతం జిమ్ ప్రో- వైస్ ఛాన్సలర్ డాక్టర్ బి గీతాంజలి, గీతం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డి.గుణశేఖరన్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement