Saturday, April 27, 2024

మురికి కూపంగా మూసీ

ప్రభ న్యూస్‌, హైదరాబాద్‌ (ప్రతినిధి) : హైదరాబాద్‌లోని ఫార్మా, కెమికల్‌ పరిశ్రమల నుంచి వెలువడే విషపదార్థాలు జీహెచ్‌ఎంసీ పరిధిలోని 50కిపైగా పెద్ద నాలాలు, వందలాది చిన్న చిన్న డ్రైనేజీల నుంచి 90శాతం మూసీ నదిలో కలుస్తున్నాయి. నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యూనల్‌ తాజా నివేధిక ప్రకారం మూసీనది తెలంగాణలోనే అత్యంత కలుషితమైన నదిగా గుర్తింపును పొందగా, నాగోల్‌ అత్యంత కలుషిత ప్రాంతమని తెలిపింది. ఈ నది వల్ల భవిష్యత్‌లో హైదరాబాద్‌ నగర ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడే అవకాశం ఉందని నివేధిక వెల్లడించింది. ఎన్‌ జీటీ -26 వేర్వేరు ప్రదేశాల్లో ఎనిమిది ప్యారమీటర్ల ప్రాతిపదికగా మూసీతోపాటు తెలంగాణలోని పలు నదులను పరిక్షించింది. ఎన్‌జీటీ అధ్యయనం ప్రకారం మూసీలోని ఒక లీటర్‌ నీటిలో 18గ్రాముల బీవోడీ ఉండగా, ఆక్సిజన్‌ మాత్రం కేవలం 0.3 మిల్లి గ్రాములు ఉందని తేల్చింది. కోలిఫాం, అమ్మోనియా, బోరాన్‌, ఎస్‌ఏఆర్‌ పదార్థాలు ప్రమాదకర స్థాయిలో ఉన్నాయని నివేదిక తేల్చింది. మూసీనదిలో ప్రవహించే నీరు మనుషులతో పాటు పశువులకు కూడా పనికిరాదని పేర్కొంది. మూసీ పరివాహక ప్రాంతం మొత్తంలో అత్యంత ప్ర మాదకరమైన ఏరియాగా నాగోల్‌ డేంజర్‌ జోన్‌లోకి వెళ్తుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది.

డేంజర్‌ జోన్‌లో నాగోల్‌..

మూసీ నది కాలుష్యం వల్ల నగరంలో అత్యంత జన స మ్మర్థం గల నాగోల్‌ క్రమంగా డేంజర్‌ జోన్‌లోకి వెలుతోంది. అనంతగిరి కొండల్లో పుట్టిన మూసీనది బాపుఘట్‌ నుంచి ప్రతాప సింగారం వరకు నగరంలో ప్రవహిస్తుంది. 44 కిలోమీటర్ల ఈ ప్రవాహంలో ఫార్మా, కెమికల్‌ పరిశ్రమ లతోపాటు గృహ, వాణిజ్య రంగాల నుంచి వెలువడే విషపదార్థాలు నదిని కాలుష్య కాసారంగా మార్చాయి. భవి ష్యత్‌లో ఈ నది ప్రక్షాళన జరగకపోతే నాగోల్‌తోపాటు ముషారంబాగ్‌, ఉప్పల్‌ తదితర ప్రాంతాల ప్రజల ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడే అవకాశం ఉందని తెలుస్తోంది.

- Advertisement -

నామ మాత్రంగా మూసీ రివర్‌ ఫ్రంట్‌ ప్రక్షాళన..

మూసీనది ప్రక్షాళనకు ఏర్పాటైన మూసీ రివర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ సుందరీకరణ పనులు నామమాత్రంగా తయారయాయనే విమర్శలున్నాయి. లోయర్‌ ట్యాంక్‌ బండ్‌ నుంచి ప్రతాప సింగారం వరకు అక్కడక్కడా చెక్‌ డ్యాంలు, వాక్‌ పాత్‌లు ఏర్పాటు చేసిందే తప్ప గృహ, వాణిజ్య, పారిశ్రామిక వాడల నుంచి వస్తున్న వ్యర్థాలను నియంత్రించడంలో విఫలమైందని పలువురు పర్యావరణ వేత్తలు ఆరోపిస్తున్నారు. నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యూనల్‌ తదితర సంస్థల నుంచి వస్తున్న ఒత్తిడిని తట్టుకునేందుకు నామమాత్రంగా చర్యలు చేపట్టిందే తప్ప మూసి ప్రక్షాళనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవడం లేదని వారు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా సర్కార్‌ మూసిని రక్షించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement