Saturday, May 18, 2024

ఎమ్మెల్సీ ఎన్నికలు – రెండో ప్రాధాన్య‌త ఓట్ల లెక్కింపు ప్రారంభం…….

న‌ల్గొండ‌/ హైద‌రాబాద్ – నల్గొండ-ఖమ్మం-వరంగల్ ఎమ్మెల్సీ స్థానానికి, హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నిక‌ల పోలింగ్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తి అయింది… తొలి ప్రాధాన్య‌తో ఓట్లలో ఏ అభ్య‌ర్ధి స‌గానికి పైగా ఓట్లు సాధించ‌డంలో విఫ‌లం కావ‌డంతో అధికారులు రెండో ప్రాధాన్య‌త ఓట్ల లెక్కింపును ఆయా లెక్కింపు కేంద్రాల‌లో ప్రారంభించారు.. నల్గొండ-ఖమ్మం-వరంగల్‌ ఎమ్మెల్సీ ఎన్నికల మొదటి ప్రాధాన్యత ఓట్ల లో 1,10,840 ఓట్లతో మొదటి స్థానంలో పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఉండగా, 83,290 ఓట్లతో రెండో స్థానంలో తీర్మార్‌ మల్లన్న ఉన్నారు. 70,072 ఓట్లతో మూడో స్థానంలో కోదండరాం ఉన్నారు. 39,107 ఓట్లతో నాలుగో స్థానంలో బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్‌ రెడ్డి ఉన్నారు. కాగా, తీర్మార్‌ మల్లన్నపై 27,550 ఓట్ల ఆధిక్యంలో పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఉన్నారు. అయితే గెలుపున‌కు అవ‌స‌ర‌మైన 1,83,168 ఓట్లను ఏ ఒక్క అభ్య‌ర్ధి సాధించ‌లేక‌పోయారు… ఇప్పుడు ఫ‌లితం రెండో ప్రాధాన్య‌ల ఓట్ల‌పై అధార‌ప‌డింది.. దీంతో ఓట్ల లెక్కింపును ప్రారంభించారు అధికారులు.. రెండో దశలో తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థుల ఎలిమినేషన్‌ ప్రక్రియ కొనసాగుతున్నది. ఇప్పటివరకు 16 మంది అభ్యర్థుల ఎలిమినేషన్‌ పూర్తయ్యింది. తక్కువ ఓట్లు వచ్చిన 10 మంది తొలి గంటన్నరలోనే ఎలిమినేట్‌ అయ్యారు. వీరికి 10 నుంచి 15 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఇక కాగా, పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపొందాలంటే ఇంకా 72,327 ఓట్లు కావాల్సి ఉంటుంది. ఇక తీన్మార్ మల్లన్నకు 99,877, ప్రొఫెసర్‌ కోదండరామ్‌కు విజయం కోసం 1,13,095 ఓట్లు కావాల్సి ఉంటుంది. అయితే రెండో ప్రాధాన్యతలోనూ ఎవ్వరికీ స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశం కనిపించడంలేదు. అందరిని ఎలిమినేషన్ చేసిన తరువాత ఇద్దరు మాత్రమే మిగిలితే.. అందులో ఎక్కువ ఓట్లు వచ్చిన వారిని విజేతగా నిర్ణయిస్తారు.
ఇక హైదరాబాద్‌: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‎నగర్ నియోజకవర్గం ఓట్ల లెక్కింపులో ఇప్పటివరకు ఆరు రౌండ్లు పూర్తయ్యాయి. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సురభి వాణీదేవి 7,626 ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఆరు రౌండ్లలో టీఆర్‌ఎస్‌కు 1,05,710 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి రామచందర్‌రావుకు 98,084 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థి ప్రొఫెసర్‌ నాగేశ్వర్‎కు 50,450 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డికి 29,627, టీడీపీ అభ్యర్థి ఎల్‌. రమణకు 5,606 ఓట్లు పోలయ్యాయి. మొత్తం ఆరు రౌండ్లలో కలిపి 19,914 ఓట్లు చెల్లుబాటుకాలేదు. చివ‌రి రౌండ్ లెక్కింపు ప్ర‌స్తుతం కొన‌సాగుతున్న‌ది… ప్ర‌స్తుతం అందుతున్న వివ‌రాల ప్ర‌కారం తొలి ప్రాధాన్య‌త ఓట్ల‌లో సగం కంటే ఏ ఒక్క అభ్య‌ర్ధి సాధించే అవ‌కాశాలు క‌నుచూపుమేర‌లో క‌న‌ప‌డ‌టం లేదు.. ఇక్కడ 93 మంది పోటీపడ్డారు. మొత్తం 5,31,268 ఓట్లకు గాను 3,57,354 ఓట్లు పోలయ్యాయి.. పోలైన ఓట్లలో సగానికి పైగా అంటే 1,78,678 ఓట్లు ఎవరికి వస్తే వారు మాత్రమే విజేతలవుతారు.. ప్రస్తుత ట్రెండ్ ప్రకారం రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు తర్వాతే ఫలితం తేలే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement