Tuesday, May 7, 2024

HYD: మెట్రోలో.. మధు యాష్కీ వినూత్న ప్రచారం

ఎల్బీనగర్, నవంబర్ 21 (ప్రభ న్యూస్) : వినూత్న ప్రచారానికి తెరలేపిన టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ ఎల్బీనగర్ ఎమ్మెల్యే అభ్యర్థి మధు యాష్కీ గౌడ్ ఇవాళ ఉదయం సాధారణ ప్రజల్లో ఒకడిగా కలిసిపోయి ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ నుండి ప్రయాణం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రయాణికులతో మాట్లాడుతూ… మెట్రో ప్రయాణీకుల కష్టనష్టాలను తెలుసుకున్నారు. ముఖ్యంగా ఐటి ప్రొఫెషనల్స్, ఇతర ఉద్యోగులతో మాట్లాడారు. మెట్రో ప్రాజెక్టు 2008లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిందన్నారు. నేడు నగరవాసులకు ట్రాఫిక్ కష్టాలు తగ్గించడమే కాకుండా సమయాన్ని కూడా ఆదా చేస్తుందన్నారు.

కాంగ్రెస్ పార్టీ విజనరీ పార్టీ అన్నారు. ఏ ప్రాజెక్టు రూపొందించినా భవిష్యత్ తరాలకు బ్రహ్మాండంగా ఉపయోగపడేలా కలకాలం నిలిచేలా ఉంటుందన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టు కట్టిన రెండేళ్లకే ప్రమాద దశకు చేరిందన్నారు. జవహర్ లాల్ నెహ్రూ హయాంలో కాంగ్రెస్ కట్టిన నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఇప్పటికీ చెక్కు చెదరలేదని, అది కాంగ్రెస్ పార్టీకి ఉన్న నిబద్ధత అని పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రజాధనం విచ్చలవిడిగా దుర్వినియోగం చేస్తూ, కమీషన్లు, కాంట్రాక్టులు అంటూ తెలంగాణలో విధ్వంసం సృష్టించారన్నారు. భవిష్యత్తు తరాల నిధిని కాపాడేది కాంగ్రెస్ పార్టీ ఒక్కటేనని, ప్రజలు విశ్వాసముంచి మీకోసం మీ పిల్లల భవిష్యత్తు కోసం ఈసారి కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటేయాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement