Saturday, May 4, 2024

ఆర్జీవీ నిర్మాణంలో రూపుదిద్దుకున్న ‘దహనం’ ఎంఎక్స్‌ ప్లేయర్ లో ప్రసారం

యాక్షన్‌ థ్రిల్లర్‌లను రూపొందించడంలో సుప్రసిద్ధులైన దర్శకుడు, నిర్మాత రామ్‌గోపాల్‌ వర్మ మరోమారు పూర్తి యాక్షన్‌ కథాంశంతో వెబ్‌ ఇసిరీస్‌ ద్వారా తిరిగి వచ్చారు. ‘దహనం’ పేరిట ఏడు ఎపిసోడ్ల సిరీస్‌గా 2022 ఏప్రిల్‌ 14 నుంచి ప్రేక్షకుల ముందుకు ఎంఎక్స్‌ ప్లేయర్‌ తీసుకురానుంది. రామ్‌గోపాల్‌ వర్మ, అభిషేక్‌ దుహన్‌, నైనా గంగూలీ, అభిలాష్‌ చౌదరి, అగస్త్య మంజులు మంగ‌ళ‌వారం ఈ సిరీస్‌ విడుదల గురించి వెల్లడించడానికి హైదరాబాద్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈసంద‌ర్భంగా రామ్‌గోపాల్‌ వర్మ మాట్లాడుతూ… త‌న మొట్టమొదటి ఓటీటీ సిరీస్‌ ‘దహనం’ను ఎంఎక్స్‌ ప్లేయర్‌ భాగస్వామ్యంతో రూపొందించి హైదరాబాద్‌లో విడుదల చేయడం పట్ల సంతోషంగా ఉన్నానన్నారు. ఈ కథనం రెండు పరస్పర విరుద్ధమైన వ్యాఖ్యలు నడుమ దాగిన చీకటి కోణాన్ని స్పృశిస్తుందన్నారు. అవేమిటంటే, ‘కంటికి కన్ను అని అనుకుంటూ వెళ్తే ప్రపంచాన్ని గుడ్డిగా మార్చడంలో మాత్రమే మనం విజయం సాధించగలమ’ని మహాత్మాగాంధీ చెబుతారు. కానీ మహాభారతంలో మాత్రం ‘ప్రతీకారం అనేది పూర్తిగా స్వచ్ఛమైన ఓ భావోద్వేగం’ అని చెబుతుందన్నారు.

‘దహనం’ వెబ్‌ సిరీస్‌లో కేవలం ప్రతీకారం గురించి మాత్రమే వెల్లడించడం కాదు, ఆ ప్రతీకార పర్యవసానాలు కూడా చర్చించామన్నారు. ఇది క్రైమ్‌ థ్రిల్లర్‌ కాదు, కానీ థ్రిల్లింగ్‌ క్రైమ్స్‌తో కూడినదన్నారు. ఊపిరిబిగపట్టి చూసేలా వీటిని తీర్చిదిద్దడం జరిగిందని, ఈ షోతో తాము కేవలం ఓ అడుగు ముందుకేయడం కాదు, కథ డిమాండ్‌ చేసిన తీరుతో తమ పాత్రలలో పరకాయ ప్రవేశం చేసిన నటీనటుల అద్భుత నటన ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ఎన్నో మైళ్ల దూరం వెళ్లగలిగామ‌న్నారు. ప్రేక్షకుల స్పందన ఏ విధంగా ఉందో తెలుసుకోవడానికి త‌మ మొత్తం బృందం ఆసక్తిగా ఎదురుచూస్తోందని అన్నారు. అనంత‌రం నటి నైనా గంగూలీ, నటుడు అభిషేక్‌ దుహాన్‌, నటుడు అభిలాష్‌ చౌదరి మాట్లాడారు. రామ్‌గోపాల్‌ వర్మ నిర్మాణంలో అగస్త్య మంజు దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో ఇషా కొప్పికర్‌, అభిషేక్‌ దుహన్‌, నైనా గంగూలీ, అశ్వత్‌కాంత్‌ శర్మ, అభిలాష్‌ చౌదరి, పార్వతి అరుణ్‌, సయాజీ షిండే మరియు ప్రదీప్‌ రావత్‌లు అత్యంత కీలకమైన పాత్రలలో నటించారు. తెలుగులో రూపొందించిన ఈ సిరీస్‌ను హిందీ, తమిళ భాషలలో డబ్బింగ్‌ చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement