Sunday, April 28, 2024

TS: బీసీ కాలనీలో ప్రభుత్వ బడి ప్రారంభం

మక్తల్, మార్చి7 (ప్రభ న్యూస్) : మక్తల్ పట్టణ పరిధిలోని బీసీ కాలనీ నూతనంగా ప్రాథమిక పాఠశాలను ఇవాళ ఎంఈఓ వెంకటయ్య నోడల్ అధికారి జిహెచ్ఎం అనిల్ గౌడ్ తోకలిసి ప్రారంభించారు. పట్టణానికి దాదాపు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న బీసీ కాలనీలో సంచార జాతులైన బుడగజంగాలు, బుడబుక్కలు వారు, కంసాలి వారు ఇతర జాతుల వారు నివసిస్తుంటారు. సుమారు 120 కుటుంబాలు కలిగిన బీసీ కాలనీలో పిల్లలు చదువుకునేందుకు మూడు కిలోమీటర్ల దూరం నడిచి మక్తల్ పట్టణానికి రావాల్సి ఉంది. జాతీయ రహదారి 167 ను దాటుకుని రోడ్డుపై నడిచి రావాల్సి ఉండడంతో పలు సందర్భాలలో విద్యార్థులు ప్రమాదాలకు గురయ్యారు. దీంతో కొంతమంది పిల్లలను తల్లిదండ్రులకు బడికి పంపకుండా పనులకు తీసుకెళ్తున్నారు.

ఈ విషయమే ఈనెల 22న ఆంధ్రప్రభ లో ప్రత్యేక కథనం రావడం జరిగింది. అదేవిధంగా స్థానికులు జిల్లా అధికారులకు ప్రజాప్రతినిధులకు వినతిపత్రం అందించడంతో జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకొని బీసీ కాలనీలో పాఠశాలల ప్రారంభించాలని ఎంఈఓకు ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు తాత్కాలిక భవనంలో పాఠశాలను ప్రారంభించారు. పట్టణంలోని కేంద్ర ప్రాథమిక పాఠశాల, బాలికల ప్రాథమిక పాఠశాల, ప్రాథమిక పాఠశాల చాకలి గేరి పాఠశాలల నుండి ప్రతినిత్యం ఒక ఉపాధ్యాయుడు విధులకు వెళ్లడంతో పాటు తాత్కాలికంగా మరో ఉపాధ్యాయుడిని నియమించారు. బీసీ కాలనీలో ప్రభుత్వ పాఠశాల ప్రారంభం కావడం పట్ల ఆ కాలనీవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు .30 రోజుల్లో విద్యార్థులకు చదవడం రాయడం నేర్పించాలని ఈ సందర్భంగా ఎంఈఓ వెంకటయ్య నోడల్ అధికారి అనిల్ గౌడ్ సూచించారు. ప్రత్యేక పాఠశాల ఏర్పాటు భవనం ఏర్పాటుకు జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిసింది. పాఠశాలలో 48 మంది విద్యార్థులు ప్రస్తుతం చదువుకుంటున్నారు. బీసీ కాలనీలో పాఠశాల ఏర్పాటు చేయడం పట్ల బుడగ జంగాల హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు రాచూరి భీమేష్ కృష్ణయ్య జిల్లా కలెక్టర్ స్థానిక ఎమ్మెల్యే కు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement