కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాపై మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. ఖమ్మం సభలో సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వంపై అమిత్ షా చేసిన కామెంట్స్పై ట్విట్టర్ ( ఎక్స్ ) వేదికగా తీవ్రంగా స్పందించారు. వచ్చే ఎన్నికల్లో గెలిచి సీఎం పదవి సాధించడం కాదు.. మీరు ముందు తెలంగాణలో సింగిల్ డిజిట్ తెచ్చుకునే ప్రయత్నం చేయండి అని విమర్శలు గుప్పించారు. మాకు నూకలు చెల్లడం కాదు.. తెలంగాణ ప్రజలు నూకలు తినాలని మీ మంత్రి పీయూష్ గోయల్ వెక్కిరించినప్పుడే బీజేపీకి తెలంగాణలో నూకలు చెల్లిపోయాయని మండిపడ్డారు.
బ్యాట్ సరిగ్గా పట్టడం చేతకాని మీ అబ్బాయిని ఏకంగా బీసీసీఐలో కీలక పదవి ఎలా వరించిందో అందరికీ తెలుసని అమిత్ షాను ఉద్దేశించి మంత్రి హరీశ్ రావు అన్నారు. అలాంటిది మీరు కుటుంబ పాలన గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. పెద్ద ఎత్తున రైతులు ఉద్యమిస్తే కార్పొరేట్ కొమ్ముకాసే చట్టాలను ఉపసంహరించుకుని తోక ముడిచిన మీరా.. రైతు బాంధవుడైన కేసీఆర్ను విమర్శించేదని దనుమాడారు.
2జీ, 3జీ, 4జీ కాదు.. కేంద్రంలో దశాబ్ద కాలంగా నాజీలను మించిన నియంతృత్వ పాలన చేస్తోంది మీరే అని విమర్శించారు. సీఎం పదవి కాదు.. ముందు తెలంగాణలో సింగిల్ డిజిట్ తెచ్చుకునేందుకు ప్రయత్నించండని మంత్రి హరీశ్ రావు అన్నారు. అబద్ధపు విమర్శలు, అవుట్డేటేడ్ ఆరోపణలు, రాసిచ్చిన స్క్రిప్ట్తో హోంమంత్రి స్కిట్ చేసి వెళ్లారని ఎద్దేవా చేశారు.