Thursday, May 9, 2024

డాక్టర్ మోహన కృష్ణ భార్గవ్ కి అంత‌ర్జాతీయ జ్యోతిష్య పుర‌స్కారం..

ప్రభ న్యూస్ ప్రతినిధి, జనగామ : జాతీయ జ్యోతిష్య విశ్వ విద్యాలయాల ప్రముఖుల చేతుల మీదుగా డాక్టర్ మోహనకృష్ణ భార్గవ్ అంతర్జాతీయ జ్యోతిష్య పురస్కారం పొందడం జనగామకే గర్వకారణం అని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. జనగామ జిల్లా కేంద్రంలోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రముఖ జ్యోతిష్య పండితులు, సామాజిక వేత్త, దేవాలయ ప్రధాన అర్చకులు డాక్టర్ మోహనకృష్ణ భార్గవకి ఘనంగా సన్మానం చేశారు. పూలమాల, శాలువ, మెమెంటో తో సత్కరించారు, పూలతో అభిషేకించారు.

ఈ సందర్భంగా ఆలయ కమిటీ నిర్వాహకులు, మాజీ కౌన్సిలర్ గజ్జెల నర్సిరెడ్డి మాట్లాడుతూ.. అక్టోబర్ 17వ తేదీన న్యూఢిల్లీ కేంద్రంగా ఇంటర్నేషనల్ ఆస్ట్రాల‌జీ ఫెడరేషన్(యూఎస్ఎ) ,ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ ఆస్ట్రాలాజికల్ సొసైటీస్, ది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఆస్ట్రా లాజికల్ సైన్సెస్, పరాశర జ్యోతిష్య విశ్వవిద్యాలయం వంటి ప్రముఖ జ్యోతిష్య సంస్థలు, విశ్వవిద్యాలయాల సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఇంటర్నేషనల్ అంతర్జాతీయ జ్యోతిష్య సంస్థల సమ్మేళన సదస్సులో ఉత్తరాకాండ్ మాజీ మంత్రి నంద కిశోర్ జీ, లోక్ సభ సభ్యులు సునీల్ బి.మెందే, డాక్టర్ గాయత్రి వాసుదేవ్ మీనన్, ఛాన్సలర్ మహేంద్ర నింబార్థే, అరున్ బన్సాల్ పాల్గొన్నారు. జాతీయ జ్యోతిష్య విశ్వవిద్యాలయాల ప్రముఖుల చేతుల మీదుగా డాక్టర్ మోహనకృష్ణ భార్గవ “అంతర్జాతీయ జ్యోతిష్య పురస్కారం” మరియు “ఇండో – అమెరికన్ ఆస్ట్రాలాజికల్ అవార్డ్” ని, అత్యంత ప్రతిష్ఠాత్మకమైన “యూఎస్ఎ ఆష్ట్రోలాజికల్ ఫెల్లోషిప్” అందుకున్నారని ..ఈ శుభ సందర్భంగా దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో సన్మానం నిర్వహించినట్లు తెలిపారు‌.

దేవాలయ కమిటీ నిర్వాహకులు యెలసాని కృష్ణమూర్తి మాట్లాడుతూ .. దేవాలయ అర్చకులు మోహనకృష్ణ ప్రపంచస్థాయి వేదికపై అంతర్జాతీయ జ్యోతిష్య పురస్కారం అందుకోవడం పట్ల హర్షం వక్తం చేశారు, గత పదకొండు సంవత్సరాలుగా ఆలయానికి నిస్వార్థ సేవలను అందిస్తున్నారని కొనియాడారు. కమిటీ అధ్యక్షులు కందాడి మల్లారెడ్డి మాట్లాడుతూ.. అర్చకులు మోహనకృష్ణ ఐఏఎఫ్ ప్రచురించిన ప్రపంచ స్థాయి ప్రముఖ జ్యోతిష్యుల విజయాల సంకలనం “ది వరల్డ్ ఆష్ట్రో బయోగ్రఫీ – ది లెగసీ ఆఫ్ ఆష్ట్రోలజీ” లో ప్రముఖ స్థానాన్ని పొంది తమ దేవాలయానికి, జనగామా జిల్లాకి కీర్తిని పెంపొందిస్తున్నారని అన్నారు.

సన్మాన గ్రహీత మోహనకృష్ణ మాట్లాడుతూ.. తనపై అభిమానంతో ఆలయ కమిటీ సభ్యులు, శ్రీరాంనగర్ కాలనీ, మూలబావి ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ, ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ ఆష్ట్రోలాజికల్ సైన్సెస్ న్యూఢిల్లీ యూనివర్సిటీ తరపున ఈ సదస్సు కోసం ఇండియన్ ఎకానమీ ఫోర్ కాస్ట్ పరిశోధన వ్యాసం రాయడానికి అవకాశం లభించిందని, తన పరిశోధన వ్యాసం ఎంపిక కావడం ద్వారా ఈ అంతర్జాతీయ పురస్కారాన్ని అందుకునే అవకాశం లభించిందని అన్నారు. జ్యోతిష్య శాస్త్రంలో తాను చేసిన పరిశోధనలు, వ్యాసాలు, చదివిన తరగతులు, జ్యోతిష్య సేవల ద్వారా వరల్డ్ బయోగ్రఫీలో ప్రముఖ స్థానం లభించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు యెలసాని రాంబాబు, పాశం శ్రీశైలం, కొర్రెముల రాంప్రసాద్, హనుమా రెడ్డి, సత్యనారాయణ గౌడ్, కళ్లెం నాగరాజు రెడ్డి, కందాడి యాదగిరి రెడ్డి, సంజీవ రెడ్డి, వేనుగోపాల్ రెడ్డి, అరుణ్ కుమార్, కాసర్ల మహేందర్, వరలక్ష్మీ, నాగమణి, ఆలయ అర్చకులు కృష్ణకుమార్ భార్గవ, శాయితేజ భార్గవ, పోచన్న, సంపత్ కుమార్, రాజశేఖర్ మరియు కాలనీ వాసులు, యువకులు, మహిళలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement