Sunday, April 28, 2024

వ‌స‌తి గృహాల్లో ఖాళీల‌ను భ‌ర్తీ చేయాల‌న్న చంద్ర‌య్య

జిల్లాలోని సంక్షేమ శాఖల వసతి గృహలలో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు హాస్టల్ వెల్ఫేర్ అధికారులు కృషి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య తెలిపారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖల వసతి గృహల నిర్వహణ, ఉపకార వేతనాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ చంద్రయ్య మాట్లాడుతూ… వసతి గృహలలో గతం కన్నా ప్రస్తుతం విద్యార్థులకు మంచి వసతి, భోజనంతో పాటు విద్యను అందించడం జరుగుతుందన్నారు. సంక్షేమ వసతి గృహల విద్యార్థుల భవిష్యత్తు బాగుపడాలంటే సంక్షేమ వసతి గృహల అధికారులు చురుకుగా పని చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వసతి గృహలకు కార్పొరేట్ స్థాయిలో కొత్త భావనలు నిర్మించి అన్ని వసతులు కల్పిస్తుందన్నారు. నిరుపేద విద్యార్థులకు వసతితో పాటు మంచి భోజనం, బట్టలు, దుప్పట్లు, కాస్మోటిక్స్ తో పాటు స్కాలర్ షిప్పులు, మంచి విద్యను అందించి వారి భవిష్యత్తును తీర్చి దిద్దుతుందన్నారు. కోవిడ్ కారణంగా వసతి గృహలలో ఏర్పడిన ఖాళీలను పూర్తి చేసేందుకు హాస్టల్ వెల్ఫేర్ అధికారులు తమ పరిధిలోని పాఠశాలల ప్రధానోపాధ్యాయులను సంప్రదించి వారి వివరాలను సేకరించాలన్నారు. ఆ విద్యార్థులు తల్లితండ్రులను సంప్రదించి మోటివేట్ చేసి అధిక సంఖ్యలో పిల్లలను వసతి గృహలలో చేర్పించాల‌ని సూచించారు.

వసతి గృహంలో ఉన్న ప్రతి విద్యార్ధి బాగోగులను తల్లి తండ్రులవలే వసతి గృహ అధికారులు చూసుకోవాలని, వారి విద్యా ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ప్రతి 15 రోజులకు ఒకసారి ఆరోగ్య చికిత్సలు నిర్వహించాలని తెలిపారు. కోవిడ్ కారణంగా గత సంవత్సరంన్న‌ర‌ కాలం నుండి దూరమైన విద్యార్థులందరినీ తిరిగి చేర్పించాలన్నారు. వసతి గృహలలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అందరికి మాస్కులు, శానిటైజర్లు అందించాలన్నారు. వసతి గృహలలో విద్యార్థులకు ప్రీ-మెట్రిక్ స్కాలర్షిప్ ల క్రింద బాలురకు రూ.1000/- బాలికలకు రూ.1500/- లు అందించడం జరుగుతుందన్నారు. ప్రతి విద్యార్ధికి బ్యాంకులలో ఖాతాలు తెరిపించాలని సూచించారు. ప్రతి వసతి గృహంలో మిషన్ భగీరథ మంచి నీటి సదుపాయం కల్పించడం జరిగిందని, ఇతర సదుపాయాలు ఏమైనా లేనట్లయితే ప్రతిపాదనలు పంపాలని, పరిశీలించి పరిష్కరించడం జరుగుతుందన్నారు. హాస్టల్ పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా చూడాలన్నారు. మురుగు నీరు నిలవకుండా ఎప్పటికప్పుడు పారిశుధ్య పనులు చేపట్టాలన్నారు.

ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖల అధికారులు మల్లేశం, కోటాజి, పుష్పలత, సుధారాణి, TSEWIDC DE రాజు లతో పాటు అన్ని సంక్షేమ శాఖల హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు, HM లు, ప్రిన్సిపాల్స్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement